Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బహమాస్ షాక్: పెద్ద చేయి, ఎవరీ నిమ్మగడ్డ ప్రసాద్?

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే) బయటపెట్టిన పత్రాలు దిగ్భ్రాంతికరమైన విషయాలను బయపెట్టాయి.. 'బహమాస్‌ లీక్స్‌' పేరిట బయటపెట్టిన 'నల్ల ముఠా'లో తెలుగువాళ్ల పేర్లు కూడా ప్రముఖంగా కనిపిస్తున్నాయి. జర్మనీ వార్తాపత్రిక సడుట్చే జైటుంగ్‌, భారత్‌లోని న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు మీడియా భాగస్వాములతో కలిసి బహమాస్‌ దేశంలో నమోదైన 1,75,000 కంపెనీలు, ట్రస్ట్‌లు, ఫౌండేషన్లు, వ్యక్తుల ఆస్తుల వివరాలను విడుదల చేసిన విషయం తెలిసిదే.

తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌, బారన్‌ గ్రూప్‌ అధినేత కబీర్‌ మూల్‌చందానీ, ఫ్యాషన్‌ టీవీ ఇండియా ప్రమోటర్‌ రాజన్‌ మధు, ప్రీమియం ఫిన్నిష్‌ వాటర్‌ బ్రాండ్‌ చైర్మన్‌ అమన్‌ గుప్తా, గుర్జీత థిల్లాన్‌, హర్‌భజన్‌ కౌర్‌, మైరా డిలోరస్‌ రెగో, అశోక్‌ చావ్లా సహా ఇంకా ప్రముఖ వ్యక్తులు ఉన్నట్లు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన కథనంలో వెల్లడించింది.

Nimmagadda Prasad

10కి పైగా కంపెనీలు నిమ్మగడ్డవే..

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితునిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, ఆయన సోదరుడు ప్రకాశ్‌ నిమ్మగడ్డలకు బహమాస్‌లో దాదాపు పది విదేశీ కంపెనీలున్నట్లు తేలింది. క్రిస్టల్‌ లేక్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌ఎల్‌సి (2007 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు), బెస్ట్‌ స్కైలైన్‌ ఇంక్‌ (ఏప్రిల్‌ 1, 2009), రౌగ్‌మోంట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డిసెంబర్‌ 27 నుంచి 2011 జనవరి 3 వరకు) కంపెనీలకు ప్రసాద్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

ఆయన సోదరుడు ప్రకాశ్‌ నిమ్మగడ్డ.. సిల్వర్‌ క్లిఫ్‌ ప్రాపర్టీస్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి ఇప్పటివరకు), బెస్ట్‌ స్కైలైన్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి డిసెంబర్‌ 27, 2007 వరకు), క్రిస్టల్‌ లేక్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌ఎల్‌సి (డిసెంబర్‌ 27, 2007 నుంచి జనవరి 3, 2011 వరకు), బెస్ట్‌ హారిజాన్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి డిసెంబర్‌ 27,2007 వరకు), కన్వెన్షియానా ఎస్టేట్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి డిసెంబర్‌ 27, 2007 వరకు), టాప్‌ స్కైలైన్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి జూలై 26, 2010 వరకు), సూపర్‌ స్కేప్‌ ఇంక్‌ (జూన్‌ 7, 2007 నుంచి డిసెంబర్‌ 27, 2007 వరకు), రౌగ్‌మోంట్‌ హోల్డింగ్స్‌ (జూన్‌ 7 2007 నుంచి డిసెంబర్‌ 27, 2007 వరకు) సంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరించినట్లు బహమాస్‌ రిజిస్ట్రీ రికార్డులు వెల్లడిస్తున్నాయి.

క్రిస్టల్‌ లేక్‌, రౌగ్‌మోంట్‌ హోల్డింగ్స్‌ కంపెనీలకు జనవరి 3, 2011న ప్రసాద్‌ నిమ్మగడ్డ రాజీనామా చేయగా టాప్‌ స్కైలైన్‌ ఇంక్‌, సిల్వర్‌ క్లిఫ్‌ ప్రాపర్టీస్‌ మినహా మిగిలిన బహమాస్‌ కంపెనీల నుంచి ప్రకాశ్‌ నిమ్మగడ్డ తప్పుకున్నారు.

మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌గా పేరు పొందిన నిమ్మగడ్డ ప్రసాద్‌ రియల్‌ ఎస్టేట్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఖాయిలాపడిన హెర్రెన్‌ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి మ్యాట్రిక్స్‌ ఫార్మాస్యుటికల్స్‌గా పేరు మార్చి లాభాలబాట పట్టించారు. 2006లో అమెరికా ఫార్మా కంపెనీ మైలాన్‌ లేబొరేటరీస్‌కు మ్యాట్రిక్స్‌ను విక్రయించి పెద్ద ఎత్తున లాభాలను గడించారు.

వాడ్రేవు, నిజాంపట్నం మధ్య పారిశ్రామిక కారిడార్‌ (వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌) కోసం 2008 జనవరిలో రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకుని మ్యాట్రిక్స్‌ ఎన్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్థాపించారు. ఈ తరుణంలోనే ప్రసాద్‌ జగన్‌ కంపెనీల్లో 854 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయ్యారు.

ఇదిలావుంటే, హెల్త్‌కేర్‌, హాస్పిటల్స్‌ల్లో ప్రసాద్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడమే కాకుండా మా టీవీ ఏర్పాటు చేసి మీడియా రంగంలోకి ప్రవేశించారు. 2015లో మా టీవీని స్టార్‌ టీవీకి విక్రయించి భారీ లాభాలు సంపాదించారు.

రాజన్‌ మధు..

ఫ్యాషన్‌ టీవీ ఇండియా ప్రమోటర్‌ రాజన్‌ మధు బహ్మాస్‌లో ట్రాన్స్‌అట్లాంటిక్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, ఈసీబీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ పేరుతో కంపెనీలను స్థాపించారు. 1998, జనవరి 14 నుంచి ట్రాన్స్‌ అట్లాంటిక్‌ టెక్‌కు ఈసీబీ డైరెక్టర్‌గా నియమితుడైన రాజన్‌ అదే నెల 19 నాటికి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

అదే రోజు ఈసీబీ ఎంటర్‌ప్రైజెస్‌ డైరెక్టర్‌గా, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని పొల్లుక్స్‌ కార్పొరేట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. రాజన్‌ మధు భారతదేశంలోని హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్‌, రిటైల్‌ ట్రేడ్‌ వంటి 15కు పైగా కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. రక్షణ శాఖకు సంబంధించి టట్రా ట్రక్కుల కుంభకోణం కేసులో రవి రిషితో సంబంధాలున్నాయంటూ 2012లో సిబిఐ దాడులు కూడా చేసింది.

అనిల్‌ అగర్వాల్‌..

వేదాంత రీసోర్సెస్‌ పీఎల్‌సీ ఫౌండర్‌, చైర్మన్‌ అయిన అనిల్‌ అగర్వాల్‌.. ఆన్‌క్లేవ్‌ పీటీసీ లిమిటెడ్‌ పేరుతో బహ్మాస్‌లో కంపెనీ ఏర్పాటు చేశారు. 2007 నవంబర్‌ 6న అనిల్‌ ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ముంబై చిరునామాతో 2007 నవంబర్‌ 14న ఈయన ఈ కంపెనీకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2013 డిసెంబర్‌ 4న ఈ కంపెనీని డిసాల్వ్‌ చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ చురుగ్గా లేదని వేదాంత తెలిపింది. వోల్కన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ద్వారా వేదాంత రీసోర్సెస్‌ పిఎల్‌సిని అనిల్‌ అగర్వాల్‌ నిర్వహిస్తున్నారు.

మొత్తం మీద, బహమాస్ తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనాలకు కారణమైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు పారిశ్రామికవేత్తలు గుట్టు దాని వల్ల రట్టయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+