చంద్రబాబుకు మరో కష్టం: పొసగక సెలవుపై టక్కర్?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో కష్టం ఎదరువుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి టక్కర్ సెలవుపై వెళ్లడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టి వంద రోజులు కూడా కాక ముందే ఈ పరిస్థితి రావడం నిజంగానే చంద్రబాబుకు మింగుడు పడని విషయం.
పైగా, చంద్రబాబుతో పొసగకనే ఆయన సెలవుపై వెళ్లాలని అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన సెలవుపై వెళ్లేందుకు ఏ కారణం చూపుతారనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు వ్యవహారశైలితో ఆయన సర్దుకుపోలేకపోతున్నారని అంటున్నారు.
ముఖ్యంగా ఐఎఎస్లు, ఐపిఎస్ల బదిలీల వ్యవహారంపై చంద్రబాబు, టక్కర్ మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. కొంతమంది అధికారులను బదిలీ చేయాలని సిఎస్ సిఫార్సు చేయగా చంద్రబాబు వేచి చూసే ధోరణి అవలంబించడం, చాలాసార్లు అందుకు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో టక్కర్ అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు.

చాలామంది సీనియర్ అధికారులు జూనియర్లుగా ఉన్నప్పటి నుండి తాను వారి పని తీరును గమనిస్తున్నానని, అందువల్ల బాగా పనిచేసే వారికి మంచి పోస్టింగ్లు ఇవ్వాలనే సిఎస్ అభిప్రాయంతో కూడా చంద్రబాబు విభేదించినట్లు తెలిసింది. పరిపాలన సజావుగా సాగుతున్న చోట కదలించకుండా ఉండడమే మంచిదని చెప్పిన సిఎస్ను ముఖ్యమంత్రి వారించినట్టు తెలుస్తోంది.
తొలుత నిమ్మగడ్డ రమేష్కుమార్ను సిఎస్గా నియమించాలని ముఖ్యమంత్రి భావించారు. టక్కర్ ఎంపికకు చంద్రబాబు మొదట్లో అంత సానుకూలత వ్యక్తం చేయలేదు. అయితే కొంతమంది ఒత్తిడితో, సీనియర్ అధికారి కావడంతో కాదనలేక టక్కర్కు పదోన్నతి కల్పించారు.
అయితే, పలు విషయాల్లో సిఎస్ను ముఖ్యమంత్రి విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు సుదీర్ఘ సమీక్షలు, రాత్రి పొద్దుపోయే వరకూ కలెక్టర్ల సమావేశాలు, వీడియోకాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ, ప్రతి రోజూ వారితో మాట్లాడే ప్రయత్నంలో కలెక్టర్ల సమయం రోజుకు మూడు నాలుగు గంటల పాటు వృథా అవుతోందనే విమర్శలు వస్తున్నాయి.

టక్కర్కు తెలియకుండానే చాలా కార్యక్రమాలను సిఎం కార్యాలయ అధికారులు నిర్వహిస్తున్నారని, అది కూడా సిఎంకు, సిఎస్కు మధ్య సంబంధాలను దెబ్బతీసిందని అంటున్నారు. ఐఎఎస్ అధికారుల బదిలీల్లో, పోస్టింగ్లలో టక్కర్ కొంత స్వేచ్ఛను కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.
అయితే అలాంటి ఆలోచనలు లేకుండానే సిఎం కార్యాలయం జాబితాలను పంపిస్తోందని, దాంతోనే టక్కర్ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. భారీగా ఐపిఎస్లను బదిలీ చేసిన చంద్రబాబు, ఒకటి రెండు రోజుల్లో ఐఎఎస్ల బదిలీలకు సైతం కసరత్తు ప్రారంభించారని, ఇదే ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడానికి కారణమైందని అంటున్నారు. మొత్తం మీద, చంద్రబాబు సమస్యను కొని తెచ్చకుంటున్నట్లే కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications