హోదా: మోడీపై పోరుకు బాబు జంకుతున్నారా?
విజయవాడ: ప్రత్యేక హోదాపై తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై పోరు చేయలేక, వెనక్కి తగ్గలేక సతమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా ప్రధాని నరేంద్ర మోడీపై పోరాటం చేయడానికి ఆయన జంకుతున్నట్లు అనిపిస్తోంది.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఈ అంశాన్ని విస్మరించబోమని అంటూనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉండాలి కాని ఇప్పటికిప్పుడు బిజెపితో తెగతెంపులు ఆలోచన చేయవద్దని తన పార్టీ నాయకులకు సెలవిస్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేముందు ఆయన ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమైన మంత్రులతో సమావేశమై ప్రత్యేక హోదాపై చర్చించారు.
అసలు విభజన చట్టంలో మనకు కల్పించిన హక్కులు, అలాగే పార్లమెంట్లో ఇచ్చిన హామీల ఉల్లంఘనలో కేంద్ర ప్రభుత్వం ఆంతర్యం ఏ మాత్రం అంతుబట్టటం లేదని చంద్రబాబు అన్నారు. అయితే ఇందుకు కారణాలేమిటో గుర్తించాల్సి ఉందని అంటున్నారు. అదే సమయంలో కేంద్రంపై ఏ ఒక్కరు కూడా సంబంధాలు బెడిసికొట్టే స్థాయిలో విమర్శలు చేయవద్దని చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి నేతలు ఇటీవలి కాలంలో విమర్శల జోరు తగ్గించడాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని చెప్పారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత త్వరలోనే ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నదని ఆ సందర్భంగా తానే స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఈ అంశాలన్నింటిపై మాట్లాడుతానని చెప్పారు. విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా అఖిలపక్షాన్ని వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లే ఆలోచన ఏ మాత్రం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేపట్టి కేంద్రంపై ఒత్తిడి తెస్తే తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆ తర్వత చంద్రబాబు కుటుంబ సమేతంగా స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ నెల 14న తిరిగి వస్తారు.












Click it and Unblock the Notifications