వెళ్లిపోయారుగా! ఇంకా ఉమ్మడేనా?: కేంద్రానికి సీఎం లేఖ!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కేంద్రంగా పాలన ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఉద్యోగులంతా అక్కడికి తరలి వెళ్లారని.. ఇక హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా పరిగణించవద్దని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనున్నట్టు సమాచారం
పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా చూపించాల్సిన అవసరం లేదని, నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా, తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ను రాజధానిగా పేర్కొంటూ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం కోరనున్నట్టు తెలిసింది.
ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది. కాగా, చట్టంలోనే 'ఉమ్మడి రాజధాని' అన్న పదాన్ని పేర్కొన్నందున, కేవలం హోం శాఖ నిర్ణయం మాత్రమే సరిపోదని ఏపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

చట్ట సవరణ చేయాల్సి వుందని, దానికి రెండు రాష్ట్రాల శాసనసభల ఆమోదం తప్పనిసరని, ఏపీ ప్రభుత్వం అంగీకరించకుండా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని అధికారులు అంటున్నారు.
ఇప్పటికీ పాలనలో భాగమైన న్యాయ సంబంధ వ్యవహారాలు, వాటిని చూసుకునే ఉద్యోగులు హైదరాబాద్లోనే ఉన్నారని, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన పూర్తి కాకుండా హైదరాబాద్ ను తెలంగాణకే ఎలా పరిమితం చేస్తారని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అంతేగాక, ఇప్పటికీ రెండు రాష్ట్రాలకూ ఒకే హైకోర్టు ఉందన్న విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications