2013 చట్టం ఏం చెబుతోంది: జీవో 123లో ఏముంది?
హైదరాబాద్: ప్రాజెక్టులకు భూసేకరణ త్వరగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గతేడాది జులై 30న జారీ చేసిన జీవో 123ని ఉమ్మడి హైకోర్టు బుధవారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టం - 2013ను తోసిరాజనేలా జారీ చేసిన ఈ జీవో చెల్లదని తేల్చి చెప్పింది.

హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంప పెట్టుగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కూడా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123 రద్దవుతుందని ముందే ఊహించామని అన్నారు. జీవో నంబర్ 123, 124ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఆ జీవోలో ఏముందనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
జీవో 123 ముఖ్యాంశాలు:
* ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కోసం భూముల సేకరణకు ప్రభుత్వం 2015 జూలై 30న జీవో 123ని జారీ చేసింది.
* భూ సేకరణ కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో 'డిస్ట్రిక్ట్ లెవెల్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కమిటీ (డీఎల్ఎల్పీసీ)' ఏర్పాటు.
* భూమిని సేకరించాలనుకునే ఏజెన్సీ (ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ) ముందుగా ఈ కమిటీకి సమాచారం ఇవ్వాలి.
* స్వచ్ఛందంగా భూములు ఇచ్చే రైతులు, యజమానులతో కమిటీ చర్చలు జరుపుతుంది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని, అగ్రిమెంట్లు చేసుకుంటుంది.
* రైతులకు పరిహారం చెల్లించి, సేకరించిన భూములను తహసీల్దారు పేరిట రిజిస్ట్రేషన్ చేస్తుంది.
* రైతుల నుంచి సేకరించిన భూమికి మార్కెట్ విలువ ప్రకారమే పరిహారం చెల్లించాలన్నది 123 జీవో ముఖ్య ఉద్దేశం.
* సేకరించిన ఇంటికి మార్కెట్ విలువ ప్రకారమే పరిహారం చెల్లిస్తారు.
* ప్రభుత్వంతో ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటే ఆ భూమి/ఇల్లుపై యజమాని పూర్తిగా హక్కులు కోల్పోతారు.
భూసేకరణ చట్టం-2013:
* ఈ చట్టం ప్రకారం గ్రామాలను తరలిస్తే.. తప్పకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద మరోచోట స్థలాన్ని చూపించి పునరావాసం కల్పించాలి. ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.
* రైతులు, భూ యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమిని ఇస్తేనే తీసుకోవాలి.
* ఉపాధి, చేతివృత్తులు, చిన్నవ్యాపారులు తదితరులకు ఒకేసారి ఆర్థిక సహాయం.
* పరిశ్రమలు, మౌలిక సదుపాయాల విషయంలో 80శాతం లబ్ధిదారులు ఒప్పుకొంటేనే భూ సేకరణకు అవకాశముంది. అదే పీపీపీ ప్రాజెక్టుల విషయంలో అయితే 70శాతం లబ్ధిదారులు అంగీకరించాలి.
* గ్రామసభలు నిర్వహించి ప్రజలను ఒప్పించిన తర్వాతే భూమిని సేకరించాలి. ముందస్తుగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. ఆరు నెలలు ముందుగానే ఈ అధ్యయనం చేసి, ఆ ప్రాంతాల్లో ఆస్పత్రులు, పాఠశాలలు, ఇళ్లు, నీటి సదుపాయాలు, పశువుల కొట్టాలు, పార్కులు... ఇలా ఏమేమీ నష్టపోతాయో వివరాలు సేకరించాలి.
* తీసుకునే భూమికి బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిహారాన్ని చెల్లించాలి. సాధారణ లబ్ధిదారులకు అయితే మార్కెట్ విలువకు మూడు రెట్లు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకైతే నాలుగు రెట్ల పరిహారాన్ని చెల్లించాలి.












Click it and Unblock the Notifications