ఎవరి ధీమా వారిదే: పవన్ ముందు తేలిపోయిన చిరు
హైదరాబాద్: సీమాంధ్రలో వెల్లువెత్తిన ఓటింగ్ నేపథ్యంలో తొలి సర్కార్ ఎవరిది అనే ప్రశ్న అందరిలోను ఉత్కంఠను రేపుతోంది. ఎన్నికల బరిలో హోరాహోరీగా తలపడిన టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఎవరి లెక్కలు అవి వేసుకుంటున్నాయి. తాము గెలుస్తామంటే తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన పోలింగ్ సరళి తమకే అనుకూలమని ఇరు పార్టీలు అంటున్నాయి. సీమాంధ్ర బరిలో హోరాహోరీగా తలపడిన టిడిపి, జగన్ పార్టీలు గెలుపు పల్లకీలో ఊరేగుతున్నాయి.
బుధవారం జరిగిన పోలింగ్ సరళిని తమదైన కోణంలో విశ్లేషిస్తూ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. సీమాంధ్రలో భారీగా జరిగిన పోలింగ్ తమకే లాభిస్తుందని పేర్కొంటున్నారు. ఈసారి టిడిపికి అవకాశమివ్వాలనే బలమైన ఆకాంక్షతోనే యువత, మహిళలు, రైతులు బూత్లకు తరలి వచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ పట్ల మొదటి నుండి ఉన్న సానుకూలత ఇప్పుడు ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతోంది.
తమకు 100 నుండి 120 సీట్లు వస్తాయని టిడిపి చెబుతుంటే, తమకు 145 ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతోంది. పోలింగ్ ముగిసిన అనంతరం టిడిపి నేతల్లో నిశ్చింతగా కనిపిస్తున్నారు. గెలుపుపై తమకు ఎలాంటి అనుమానం లేదని, ఘన విజయం సాధిస్తామంటున్నారు. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ జరిగిన ఘర్షణలు, దాడులు వారిలో ఆందోళన కలిగించకపోగా ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచాయట.
ఈ దాడులు, ఘర్షణలన్నీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రేరేపించినవేనని, గెలుస్తామనే నమ్మకముంటే ఇలా దాడులకు దిగరని, ఓటమి భయంతోనే వారు ఇలా చేశారంటున్నారు. దీనిని బట్టే ఫలితం దాదాపు తేలిపోయినట్లే అన్నారు. కోస్తాలో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకూ టిడిపి ప్రభంజనం వీచిందని ఆ పార్టీ వర్గాలు అంతర్గతంగా విశ్లేషిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో మాత్రం పరిస్థితి పోటాపోటీగా ఉందంటున్నారు. ఇరుపార్టీలు సమాన స్థాయిలో సీట్లు సాధించవచ్చునంటున్నారు.

రాయలసీమలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తమకు కడపలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని భావిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జగన్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందని, అయినప్పటికీ తమకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందంటున్నారు. కొత్త రాష్ట్రంగా ప్రస్థానం ప్రారంభిస్తున్న సీమాంధ్రను చంద్రబాబు అయితేనే అభివృద్ధి పథంలో నడిపించగలరనే నమ్మకం ప్రజల్లో కలగడం, ఎన్నికల ప్రచారాన్ని బలంగా నిర్వహించడంతో వాతావరణం తమకు అనుకూలంగా మారిందన్నారు.
పోలింగ్కు ముందు చివరి వారంలో టిడిపి, బిజెపి తరఫున చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ తదితరులు నిర్వహించిన ప్రచారం ఓటర్లపై ముద్ర వేసిందంటున్నారు. పొత్తులో భాగంగా బిజెపికి ఇచ్చిన సీట్లపై టిడిపి నేతలు తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ సరళిని చూస్తే ఆ సీట్లలోనూ అత్యధికం గెలిచే అవకాశముందంటున్నారు. మరోవైపు పోలింగ్ ఏకపక్షంగా జరిగిందని, తమ విజయానికి తిరుగు లేదని జగన్ పార్టీ చెబుతోంది.
విజయం తిరుగులేని విశ్వాసం ప్రకటించింది. తాము 140 స్థానాలు సాధిస్తామని మైసూరా రెడ్డి చెప్పారు. మధ్య తరగతి వర్గం, చదువుకొన్నవారిలో కొందరు మినహాయిస్తే పేదలు, కొన్ని బలమైన సామాజిక వర్గాలు తమ వెంటే ఉన్నారంటున్నారు.
వైయస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల అమలు కొనసాగాలని కోరుకున్నవారంతా తమకే ఓటు వేశారంటున్నారు. బిజెపి, టిడిపి దోస్తీ వల్ల మైనారిటీ ఓట్లు తమ ఖాతాలో పడ్డాయని భావిస్తున్నారు. ఇక కాంగ్రెసు, కిరణ్ కుమార్ రెడ్డి జెఎస్పీలు కనీస ప్రాతినిథ్యంపై ఆశలు పెట్టుకున్నాయి. కాంగ్రెసుకు గెలుపు అవకాశాలు లేకపోవడంతో... టిడిపి, బిజెపిలకు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ముందు చిరంజీవి తేలిపోయారంటున్నారు!












Click it and Unblock the Notifications