షీలా ట్విస్ట్: కేజ్రీవాల్కు కష్టాలు మొదలయ్యాయా?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి)కి కష్టాలు మొదలయ్యాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తర్వాత.. రెండో స్థానంలో నిలిచిన ఎఎపి కాంగ్రెసు మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడింది. ప్రజాభిప్రాయ సేకరణలో 74 శాతం మంది ఢిల్లీ ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారన్న కేజ్రీవాల్.. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ను ప్రభుత్వ ఏర్పాటుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెసు, బిజెపిలపై నిప్పులు చెరిగి 28 స్థానాలు దక్కించుకున్న ఎఎపి తిరిగి కాంగ్రెసు పార్టీతోనే కలవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు కాంగ్రెసు, బిజెపిలకు సమదూరంలో ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రజలు తిరస్కరించిన పార్టీతో కేజ్రీవాల్ చేతులు కలపడం ఎఎపికి ప్రతికూలతే అంటున్నారు. గత పదిహేనేళ్లుగా ఢిల్లీలో కాంగ్రెసు ప్రభుత్వమే ఉన్నందున కేజ్రీవాల్ ఆ పార్టీతో కలవకుండా మళ్లీ ఎన్నికలకు వెళ్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అధికారం కోసం కేజ్రీవాల్ అవినీతితో రాజీపడ్డారని, ఎఎపి ఢిల్లీ ప్రజలను మోసం చేసిందని ఢిల్లీ బిజెపి నేత హర్షవర్ధన్ విమర్శించారు. కాంగ్రెసు వైఫల్యాన్ని ఎండగట్టి ఇప్పుడు అదే పార్టీ మద్దతు తీసుకోవడమేమిటని హర్ష ప్రశ్నించారు. అది ప్రజాస్వామ్యాన్ని వంచించడమేనన్నారు. ప్రజలు కాంగ్రెసుకు వ్యతిరేకంగా తీర్పిచ్చారన్నారు. కాంగ్రెసు, ఎఎపిలు ఒక ఎత్తుగడ ప్రకారమే ఎన్నికల్లో పోటీ చేశాయన్నారు.
మరోవైపు కేజ్రీవాల్కు షీలాదీక్షిత్ ట్విస్ట్ ఇచ్చారు. తాము ఎఎపికి బేషరతుగా మద్దతిచ్చామనుకుంటే అది భ్రమే అవుతుందన్నారు. ఇచ్చిన హామీలను కేజ్రీవాల్ నెరవేర్చకుంటే, లోపాలు ఉంటే తాము మద్దతును ఉపసంహరించుకుంటామని చెప్పారు. బిజెపి, కాంగ్రెసు పార్టీలు వ్యూహాత్మకంగా ఎఎపి పార్టీని తుడిచి పెట్టేసే ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.
మరోవైపు కాంగ్రెసు మద్దతు తీసుకున్నంత మాత్రాన కేజ్రీవాల్ అధికారం కోసం పాకులాడుతున్నట్లు కాదని, మంచి పాలన అందించేందుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే అలా చేశారని, కేజ్రీవాల్ 'కొత్త' పాలనను చూపిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు అనూహ్య రీతిలో గెలిపించడం ఖాయమంటున్నారు. కాంగ్రెసు బేషరతుగా మద్దతు ఇవ్వకపోయినా తన మార్క్ పాలన చూపిస్తారంటున్నారు.












Click it and Unblock the Notifications