పుల్లారావుకు రఘువీరా ఫోన్ బెడద: బాబుపై హెచ్చరిక
హైదరాబాద్/ విశాఖపట్నం: రుణమాఫీపై ఎలాంటి సమస్యలున్నా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఫోన్ చేసి మాట్లాడవచ్చని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రత్తిపాటి నెంబర్ను మీడియాలో చెప్పారు. అప్పటినుంచి మంత్రికి కాల్స్ బెడద పెరిగిపోయింది. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి వద్ద ప్రస్తావించారు.
ఫోన్తో బిజీగా ఉంటున్నారేమిటని మీడియా ప్రతినిధులు అడిగితే రఘువీరా రెడ్డి చేసిన పనికి రైతులంతా నాకు కాల్స్ చేస్తున్నారని పుల్లారావు చమత్కరించారు. హుధుద్ తుఫాను సాయం పంపిణీలో భారీ అవినీతి చోటుచేసుకుందని, టీడీపీ నేతలు రూ150 కోట్ల మేర దోచుకున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.
ఇదిలావుంటే, ఎన్నికల సమయంలో ప్రజలకు మోసపూరితమైన వాగ్దానాలు చేసిన టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయనందుకు టిడిపి గుర్తింపును రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా ఇదే విషయమై ఇటీవల రాష్ట్ర గవర్నర్కు వినతిపత్రం అందజేశామన్నారు.
శుక్రవారం విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో మాజీ ఎంపి, దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ 82వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రఘువీరా ముఖ్య అతిథిగా విచ్ఛేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలలో దేనిని అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల సంభవించిన హుదూద్ తుపానులో కూడా అవినీతి చోటు చేసుకుందన్నారు. దీనిపై తాము బహిరంగ విచారణకు సిద్ధమేనన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ అప్పట్లో చంద్రబాబునాయుడిని ప్రశ్నించగా, తాను మొదటి సంతకంతోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని స్పష్టం చేశారని రఘువీరా చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతోపాటు హుదూద్ తుపానులో అవినీతిపై హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నట్టు చెప్పారు. మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఈ పిటిషన్ దాఖలు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.