దారుణం: ఓ వ్యక్తి ప్రాణం తీసిన పానీ పూరీ గొడవ
న్యూఢిల్లీ: పానీ పూరీ తింటున్నప్పుడు వచ్చిన ఓ గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 4వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఢిల్లీలోని భలస్వా డౌరీ ప్రాంతంలోని మద్యం దుకాణం సమీపంలో ఉన్న పానీ పూరీ బండి వద్దకు ఇర్ఫాన్ అనే వ్యక్తి వచ్చాడు.
ఆ తర్వాత అక్కడికే వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు పానీ పూరీ తమకే మొదట పెట్టాలని బండివాడిని కోరారు. అయితే ఇందుకు ఇర్ఫాన్ వారిని వారించాడు. ఇర్ఫాన్కు ఈ ఇద్దరికి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది.
ఈ గొడవ కాస్త పెరగడంతో ఆగ్రహం పట్టలేని ఆ ఇద్దరు వ్యక్తులు ఇర్ఫాన్పై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్ మృతి చెందాడు. దీంతో నిందితులు ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ గొడవ మొత్తం సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా స్వరూప్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఫొటోలతో పోస్టర్లు వేయించారు. ఎట్టకేలకు గురువారం ఇద్దరు నిందితులు సునీల్ కుమార్, లక్కీలను అరెస్ట్ చేశారు.