మార్చి 13న ఏపీ బడ్జెట్.. 6నుంచి అసెంబ్లీ సమావేశాలు: చంద్రబాబు
వెలగపూడిలోని తాత్కాళిక సచివాలయంలో ఆయా శాఖల మంత్రులతో సీఎం సమావేశమై పలు అంశాల గురించి చర్చించారు.
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ను మార్చి 13వ తేదీన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రవేశపెడతారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు వెలగపూడిలోని తాత్కాళిక సచివాలయంలో ఆయా శాఖల మంత్రులతో సీఎం సమావేశమై పలు అంశాల గురించి చర్చించారు.
సమావేశానంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. మార్చి 6న శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు.అలాగే రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ పై ఆయన స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించామని, వేసవిలో కూడా విద్యుత్ కొరత లేకుండా చేస్తున్నామని అన్నారు.
విద్యార్థుల స్కాలర్ షిప్స్ విషయంలో టెక్నాలజీని వాడుకున్నామని పేర్కొన్నారు. ఆధార్ కార్డు అనుసంధానంతో లెక్కల్లో కచ్చితత్వం, పారదర్శకత ఏర్పడిందని తెలిపారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల రీత్యా రిజర్వాయర్లలో నీళ్లు లేవన్నారు. వట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల కృష్ణాడెల్టాకు నీళ్లివ్వగలిగామని, ఇది రాయలసీమకు కలిసొచ్చిందని వివరించారు.
రెండేళ్లలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోగలిగామన్న చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు.