మీరు వినకుంటే.. నా దారిలో నేను: పత్రికలు ముందేసి.. బాబు హెచ్చరిక
ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి మంత్రులకు, నాయకులకు మరోసారి క్లాస్ పీకారు. విశాఖ జిల్లా నేతలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
విజయవాడ: ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి మంత్రులకు, నాయకులకు మరోసారి క్లాస్ పీకారు. విశాఖ జిల్లా నేతలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
నేతలు అయితేళ్ల కోసం పని చేయడం కాదని, శాశ్వతంగా ప్రజల కోసం పని చేయాలని, పార్టీ ప్రతిష్ట పెంచాలని సూచించారు. విభేదాలతో రచ్చకు ఎక్కవద్దని హితవు పలికారు. పార్టీని గాలికి వదిలేస్తే.. నా దారిలో నేను వెళ్తానని హెచ్చరించారు.
గంటా ఎఫెక్ట్: సొంత ప్రభుత్వంపై అయ్యన్న సంచలనం, జగన్కు ఛాన్స్
విజయవాడలోని తన నివాసంలో సోమవారం రాత్రి వారితో విశాఖ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ మార్గాల్లో సేకరించిన అనేక అంశాలను నేతల ముందు ఉంచారు. సమన్వయంతో ముందుకెళ్లాలని హితవు పలికారు.
నాయకుల మధ్య విభేదాలకు చరమగీతం పాడాల్సిందేనని, లేదంటే ఊరుకునేది లేదన్నారు. పార్టీ ఉంటేనే నాయకులకు మనుగడ అని, తనతో పాటు మీరూ ఇలా ఆలోచిస్తేనే భవిష్యత్తు ఉంటుందన్నారు.
నగరంలో సభ్యత్వ నమోదు, నవీకరణలో వెనకబాటుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్న పాత్రుడుల మధ్య, ఇతర నేతల మధ్య సయోధ్య లేకపోవడంపై సీరియస్ అయ్యారు.
నేతల మధ్య సయోధ్య లేదని, అందుకే పత్రికల్లో వ్యతిరేక కథనాలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. పత్రికల్లో నగరంలో 59 వ్యతిరేక కథనాలు ప్రచురితమైతే, గ్రామీణంలో 120 కథనాలు ప్రచురితమయ్యాయని.. క్లిప్పింగులతో సహా చూపించారు.
ఇలాగైతే సహించేది లేదన్నారు. వర్గపోరు వద్దన్నారు. విమర్శలు చేసుకొని మీడియా ముందు, ప్రజల ముందు చులకన కావొద్దన్నారు. కాగా, మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.