ఏపీకి కేంద్రం భారీ రైలు ప్రాజెక్టులు-
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి కేంద్రం తీపికబురు వినిపించింది. కోట్ల రూపాయల విలువ చేసే రైల్వే పనులను మంజూరు చేసింది. రైల్వే లేన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయాలు తీసుకుంది.
ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో రైల్వే మంత్రిత్వ శాఖ నిర్మించ తలపెట్టిన మూడు ప్రాజెక్టులకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణ అంచనా వ్యయం.. దాదాపు 23,437 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తి కానున్నాయి. ఇందులో నాగ్దా- మధుర, గుంతకల్- వాడి, బుర్హ్వాల్- సీతాపూర్ లైన్లుు ఉన్నాయి. ఈ మూడు మార్గాల్లో కూడా నూతనంగా 3, 4వ రైల్వే లైన్ల నిర్మాణాలను చేపడుతుంది కేంద్రం.

ఈ ప్రాజెక్టులు ప్రధాని మోదీ నవభారత్ నిర్మాణ దార్శనికతకు అనుగుణంగా, 'ఆత్మనిర్భర్' కేంద్ర బిందువుగా కొనసాగుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. పీఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద, మల్టీ-మోడల్ రైల్ కనెక్టివిటీ, లాజిస్టిక్, కార్గో ట్రాన్స్ పోర్టేషన్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి తాజా ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించింది. దీనిద్వారా సమగ్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాలను మెరుగుపడతాయని తెలిపింది.
ఈ మూడు ప్రాజెక్టులు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 19 జిల్లాల్లో విస్తరిస్తాయి. రైల్వే నెట్వర్క్ను సుమారు 901 కిలోమీటర్లు అదనంగా చేరనున్నాయి. ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్ 83 లక్షల జనాభా ఉన్న సుమారు 4,161 గ్రామాలకు మెరుగైన కనెక్టివిటీని కల్పిస్తుంది. మహాకాళేశ్వర్, రణతంభోర్ నేషనల్ పార్క్, కూనో నేషనల్ పార్క్, కేయోలాడియో నేషనల్ పార్క్, మధుర, బృందావనం, మంత్రాలయం,నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం, శ్యాంనాథ్, నైమిషారణ్యం వంటి కేంద్రాలకు రైలు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది.
బొగ్గు, ఆహార ధాన్యాలు, సిమెంట్, ఇనుము, ఉక్కు, ఇనుప ఖనిజం, కంటెయినర్, ఎరువులు వంటి కీలక వస్తువుల రవాణాకు ఈ మార్గాలు అత్యవసరం. సామర్థ్య పెంపుదలతో సంవత్సరానికి అదనంగా 60 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యమవుతుంది. పర్యావరణ హిత, ఇంధన సామర్థ్యం కలిగిన రైల్వే రవాణా లక్ష్య సాధన, దేశ లాజిస్టిక్స్ వ్యయ తగ్గింపునకు తోడ్పడుతుంది. ఇది 37 కోట్ల లీటర్ల చమురు దిగుమతిని, 185 కోట్ల కిలోల సీఓ2 ఉద్గారాలను తగ్గిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications