ఏపీలో దారుణం.. భర్త చేతిలో మరో భార్య బలి
కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం సృష్టించిన పద్మజ మృతి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసు, విచారణలో హత్యగా తేలింది. పద్మజ భర్త కిరణ్కుమార్నే నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ వెల్లడించారు.
కాగా ఏప్రిల్ 30న పద్మజ మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మరణ పరిస్థితులు అనుమానాస్పదంగా ఉండటంతో పోస్టుమార్టం నిర్వహించగా, ఇది సహజ మరణం కాదని తేలింది. దీంతో భర్త కిరణ్కుమార్పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో కిరణ్ అసలు ప్లాన్ బయటపడింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. కిరణ్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉంది. భార్య పద్మజ తరచూ అనుమానం వ్యక్తం చేయడం, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటం వల్ల ఆమెను అడ్డుగా భావించాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని ముందే పథకం రచించాడు. యూట్యూబ్లో హత్యకు సంబంధించిన పద్ధతులను శోధించి, ఒక అజ్ఞాత వ్యక్తితో సంప్రదింపులు జరిపాడు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విషాన్ని తెప్పించిన కిరణ్, ఏప్రిల్ 29న పద్మజకు స్వీట్ (పాలకోవా)లో కలిపి తినిపించాడు.
అయితే ఆ స్వీట్ తిన్న కొద్దిసేపటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె పూర్తిగా చనిపోయిందో లేదో నిర్ధారించుకోవడానికి, ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలో కిరణ్ ప్రియురాలికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిందితుడు ఒక్కడే ఈ కుట్ర పన్నినట్లు వెల్లడించారు. అలాగే విషం విక్రయించిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ వివాదాలు, అనుమానాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో ఈ సంఘటన మరోసారి చూపించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తూ, సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications