ఏపీ, తెలంగాణాలలో ఈ జిల్లాలకు అకాల వర్షాల హెచ్చరిక !
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించి హెచ్చరిక చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు కురవనున్నాయి అని పేర్కొంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండగా, తాజాగా మరోమారు వర్ష హెచ్చరిక చేసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో ఈ ప్రాంతాలలో వర్షాలు
తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని, ఫలితంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణాలో మూడు రోజులపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం
అంతేకాదు తిరుపతి, చిత్తూరు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో వర్షాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండడం మంచిది కాదని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మూడు రోజులపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాష్ట్రంలో అనేక జిల్లాలలో వడగండ్ల వాన
నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాలలో వడగళ్ల వర్షం కురిసింది. రానున్న మూడు రోజులు కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటలు వర్షంలో తడవకుండా కాపాడుకోవాలని సూచించింది.
అకాల వర్షాల కారణంగా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా తగిన చర్యలు
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం కాకుండా కాపాడుకోవాలని సూచించింది వాతావరణ శాఖ. మరోవైపు ప్రభుత్వం కూడా అకాల వర్షాల కారణంగా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.













Click it and Unblock the Notifications