తిరుమలలో దుకాణదారులకు కీలక ఆదేశాలు
Tirumala: లక్షలాదిమంది భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రం.. తిరుమల. ప్రతిరోజూ లక్షమందికి తగ్గకుండా భక్తులు అక్కడ ఉంటారు. వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇటువంటి పవిత్ర ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగంతో కలిసి ఆపరేషన్ వజ్రప్రహార్ నిర్వహించింది.
తిరుమలలో భద్రతను పటిష్టం చేయడానికి ఈ ఆపరేషన్ వజ్రపహార్ చేపట్టారు జిల్లా పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు. దీని కింద ప్రత్యేక నాకాబందీ తనిఖీలు చేపట్టారు. తిరుమలతో పాటు ఆకాశగంగ, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళికృష్ణ పర్యవేక్షణలో ఈ తనిఖీలు సాగాయి. వారు దగ్గరుండి తనిఖీలు చేశారు.

పోలీసులతో పాటు టీటీడీ విజిలెన్స్, అటవీ, అగ్నిమాపక, రెవెన్యూ, ఎక్సైజ్, ఆరోగ్య శాఖలు, బాంబు డిస్పోజల్ బృందాల నుండి సుమారు 45 మంది సిబ్బంది ఈ జాయింట్ కోఆర్డినేషన్ సెక్యూరిటీ డ్రైవ్లో పాల్గొన్నారు. తనిఖీల కోసం ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు. స్థానిక దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. వారి లైసెన్స్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన గుర్తింపు లేని 18 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మూడు గుర్తు తెలియని వాహనాలను సీజ్ చేశారు. 66 మంది వేలిముద్రలను రికార్డు చేశారు. వారి వివరాలను నమోదు చేసుకున్నారు. దుకాణాల లైసెన్సులు, ఉద్యోగుల వివరాలు, సబ్ లీజ్ డాక్యుమెంట్లన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల యజమానులు, అక్కడి సిబ్బందికి కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
గంజాయి, మద్యం, పొగాకు వంటి నిషేధిత వస్తువులను విక్రయించరాదని వార్నింగ్ ఇచ్చారు. తెలియని వారికి దుకాణాలను అద్దెకు ఇవ్వరాదని దుకాణాల యజమానులకు సూచించారు. కొత్తగా షాపుల్లో పనుల్లో చేరే వారి వివరాలను ముందుగా పోలీసులకు అందించాలని సూచించారు. అన్ని దుకాణాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని తేల్చి చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడాలని అధికారులు ఆదేశించారు. అత్యవసర సహాయ నంబర్లు 1972, 112 గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.












Click it and Unblock the Notifications