వర్మకు టీడీపీ బిగ్ షాక్, పిఠాపురం బాధ్యతల నుంచి తొలిగింపు..!!
టీడీపీ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం పార్టీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వర్మ పార్టీ ఇంఛార్జ్ గా ఉన్నారు. అయితే.. కొద్ది రోజు ల క్రితం చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదంలో వర్మ తీరు పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా.. ఇప్పుడు పిఠాపురంలో పార్టీ పరంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ అధిష్ఠానం పిఠాపురం వేదికగా సంచలన నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసిన సమయంలో వర్మకు సీటు రాకపోవటం పైన ఆయన మద్దతు దారులు ఆందోళనకు దిగారు. అయితే, వర్మ తాను పవన్ కు సహకరిస్తానని ప్రకటించారు. పవన్ సైతం తన గెలుపు బాధ్యతలు వర్మకే అప్పగిస్తున్నానని చెప్పుకొచ్చారు.

కొంత కాలంగా పిఠాపురంలో వర్మకు జనసేన నేతలు సరైన గౌరవం ఇవ్వటం లేదనే అభిప్రాయం ఉంది. టీడీపీ- జనసేన మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫొటో ఫ్లెక్సీ పైన లేకపోవటం పైన వర్మ నిలదీసారు. ఆ సమయంలో టీడీపీ - జనసేన వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ అంశం పైన సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. వర్మ తీరు పైన అగ్రహంతో ఉన్న సీఎం.. ఈ వ్యవహారం పైన మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను ఆదేశించారు. కాగా.. తాజాగా పార్టీ పోలిట్ బ్యూరో.. కమిటీల ప్రమాణ స్వీకార సమయంలోనూ పరోక్షంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొందరి ప్రవర్తనతో తాను ఆవేదన చెందనని వ్యాఖ్యా నించారు.

కాగా.. ఆ తరువాత వర్మ తన కుమారుడుతో సహా లోకేష్ ను కలిసినట్లుగా పార్టీలో ప్రచారం ఉంది. ఇక.. ఇప్పుడు వర్మను పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి.. అక్కడ పార్టీ కమిటీ ఏర్పాటు చేసారు. టీడీపీ కమిటీ పిఠాపురంలో పార్టీ వ్యవహారాలను ఇక పర్యవేక్షణ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు వర్మ కోరితే ఆ బాధ్యతల నుంచి తప్పించారా.. లేక, పార్టీనే వర్మను పక్కన పెట్టిందా అనేది స్పష్టత రావాల్సి ఉంది












Click it and Unblock the Notifications