విశాఖపట్నం నుంచి ముంబై వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ రైలుకు (visakhapatnam-Mumbai LTT Express) గోదావరి జిల్లాల్లో ఓ కొత్త హాల్ట్ మంజూరు చేసింది. ఈ హాల్ట్ కోసం ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖపట్నం నుంచి ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ)కి వెళ్లే రైలుకు, అలాగే తిరుగు ప్రయాణంలో వచ్చే రైలుకు కూడా నిడదవోలు (Nidadavolu) జంక్షన్ లో హాల్ట్ మంజూరు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన విజ్ఞప్తికి రైల్వే శాఖ సానుకూలంగా స్పందించి ఈ ప్రకటన చేసింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ఈ హాల్ట్ కు సంబంధించి రైళ్లు ఆగే సమయాల్ని దక్షిణ కోస్తా రైల్వే విడుదల చేయనుంది.
నిడదవోలు రైల్వే స్టేషన్లో విశాఖపట్నం-ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టిటి) ఎక్స్ప్రెస్ (18519/18520)కు హాల్ట్ మంజూరైనందుకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ హాల్ట్తో గోదావరి జిల్లాల ప్రజలకు దేశ ఆర్థిక రాజధాని ముంబైతో మరింత మెరుగైన రైల్వే అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.