కరోనా: కేంద్రం కీలక నిర్ణయం.. పరిశ్రమలన్నింటికీ ఆక్సిజన్ సప్లై నిషేధం... ఆ తొమ్మిదింటికి మినహాయింపు..


దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమైంది. అన్ని రాష్ట్రాల్లో ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయిన పరిస్థితి. కొన్నిచోట్ల ఆస్పత్రి బయటే పేషెంట్లకు చికిత్స అందిస్తున్న దుస్థితి నెలకొంది. ఇక ఆక్సిజన్,వెంటిలేటర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నవారు... ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా డజన్ల సంఖ్యలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 22 నుంచి నిషేధం...

దేశంలోని కేవలం 9 పరిశ్రమలకు మినహా మిగతా పరిశ్రమలన్నింటికీ ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఆక్సిజన్ సరఫరా తాత్కాలికంగా నిషేధించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు లేఖలు రాశారు. కేంద్రం పేర్కొన్న 9 పరిశ్రమలకు మినహా మిగతా ఏ పరిశ్రమకు ఏప్రిల్ 22 నుంచి ఆక్సిజన్ సరఫరా చేయకూడదని సూచించారు.

తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ...

'కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్ది ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతోంది... ముఖ్యంగా కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,గుజరాత్,ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిపై సమీక్ష నిర్వహించిన కేంద్రం.. పరిశ్రమలకు సరఫరా చేస్తున్న ఆక్సిజన్‌ను మెడికల్ అవసరాలకు సప్లై చేయాల్సిందిగా నిర్ణయించింది. తద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగినవారమవుతాం.' అని అజయ్ భల్లా ఆ లేఖల్లో పేర్కొన్నారు.తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ ఏప్రిల్ 22 నుంచి పరిశ్రమలకు ఆక్సిజన్ సప్లై నిలిపివేయాలని పేర్కొన్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాలు సంబంధిత అధికారులకు వెంటనే దీనిపై సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
వేటికి మినహాయింపు...

1) అంపౌల్స్ మరియు వైల్స్ 2) ఫార్మాస్యూటికల్ 3) పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు 4) స్టీల్ ప్లాంట్ 5) అణు శక్తి సౌకర్యాలు 6) ఆక్సిజన్ సిలిండర్ తయారీదారులు 7) మురుగునీటి శుద్ధి కర్మాగారాలు 8) ఆహారం మరియు నీటి శుద్దీకరణ 9) నిరంతరం లోహాలను కరిగించే,ఇతరత్రా ప్రక్రియలు జరిగే పరిశ్రమలు... ఈ తొమ్మిదింటికి కేంద్రం ఆక్సిజన్ సప్లై నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది.

మధ్యప్రదేశ్‌లో ఐదు ఆక్సిజన్ ప్లాంట్స్..

దేశంలో ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు మధ్యప్రదేశ్‌లో కేంద్రం ఐదు ఆక్సిజన్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత పెద్ద సమస్యగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ... ఆక్సిజన్ సరఫరాను పెంచాల్సిన అవసరముందని చెప్పారు. ఢిల్లీలో ఆక్సిజన్ ఇప్పుడు ఎమర్జెన్సీ అవసరంగా మారిందన్నారు. అంతేకాదు,ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రోజువారీ ఆక్సిజన్ ఉత్పత్తిలో 60శాతం డిమాండ్ నెలకొందని.. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Read more...

English Summary

The supply of oxygen meant for industries will now be diverted for medical use in the country as it battles a record surge in the COVID-19 cases in the deadly second wave of the pandemic, said a letter from the government to the chief secretaries of all the states.