త్వరలో అపర ఏకాదశి- అపార ఫలితాలను ఇచ్చే శుభదినం
హిందూ ధర్మంలో ఏకాదశికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో రెండుసార్లు వచ్చే ఈ పవిత్ర దినాన శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వల్ల సద్గతి ప్రాప్తిస్తుందని విశ్వాసం. జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని అపర ఏకాదశిగా జరుపుకొంటారు. ఈ ఏడాది అపర ఏకాదశి ఈ నెల 13న రానుంది.
ఏకాదశి తిథి 12న మధ్యాహ్నం 2:52 నిమిషాలకు ప్రారంభమై 13న మధ్యాహం 1:29 నిమిషాలకు ముగుస్తుంది. ఉపవాస దీక్ష విరమించే పారణ సమయం 14వ తేదీన తెల్లవారు జామున 5:31 నిమిషాల నుండి ఉదయం 8:14 నిమిషాల వరకు ఉంటుంది. అదే రోజున ద్వాదశి తిథి ఉదయం 11:20 నిమిషాలకు ముగుస్తుంది.

ఈ రోజున వైష్ణవ భక్తులు సూర్యోదయం నుండి కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. ద్వాదశి తిథి నాడు పారణ తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ ఉపవాసం ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆత్మనిగ్రహం, అంతర్గత శాంతిని కలుగజేస్తుందని విశ్వాసిస్తారు. స్వచ్ఛమైన భక్తితో ఆ దేవదేవుడిని పూజించిన వారికి సానుకూలత, సమృద్ధి, శ్రేయస్సు లభించి మరణానంతరం విష్ణు లోకంలో చోటు దక్కుతుందని, జనన మరణాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
అపర అంటే అపరిమితమైన అని అర్థం. కౌరవులపై విజయం కోసం పాండవులు ఈ రోజున ఉపవాసం ఆచరించారు. గోమతి నది స్నానం, కుంభమేళాలో కేదార్నాథ్ దర్శనం, బద్రికాశ్రమంలో నివాసం, సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో కురుక్షేత్ర స్నానం వంటి మహా పుణ్యాలు అపర ఏకాదశి వ్రతం వల్ల లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని మోక్షం, సమృద్ధిని ప్రసాదించే విశేష ఏకాదశిగా పరిగణిస్తారు. పద్మ పురాణం, బ్రహ్మ పురాణాలలో అపర ఏకాదశి ప్రస్తావన ఉంది.
అపర ఏకాదశి పూజా విధానాలు: భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి, పూజ కార్యక్రమాలను ప్రారంభించాలి. విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి, నెయ్యితో దీపం వెలిగించి, పుష్పాలతో అలంకరించి పూజ చేయాలి. పాలు, నెయ్యి, పెరుగు, తేనె, చక్కెరతో కలిపిన పంచామృతాన్ని, సాత్విక ప్రసాదాన్ని సమర్పించాలి. "ఓం నమో భగవతే వాసుదేవాయ" మంత్రాన్ని పఠిస్తూ రోజును గడపాలి. అనంతరం విష్ణు హారతి ఇచ్చి, ప్రసాదాన్ని సమర్పించాలి.
శ్రీవేంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడి, వేణుగోపాలస్వామి వంటి వైష్ణవాలయాలను సందర్శించడం ఆనవాయితీ. అనంతరం ద్వాదశి తిథి నాడు ఉపవాసం విరమిచాలి. ఆకలిని నియంత్రించలేని వారు సాయంత్రం సాత్విక ఆహారం తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications