'మళ్లీ నీట్ రాసే ధైర్యం లేదు'.. వైరల్ అవుతున్న విద్యార్థిని చివరి లేఖ!
నీట్-యూజీ 2026 వివాదాల నేపథ్యంలో దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన 18 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆకాంక్ష చతుర్వేది రాసిన ఆత్మహత్య లేఖ సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేయడంతో మళ్లీ పరీక్ష రాయాలనే భయంతో ఆ నిరుపేద విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
మధ్యప్రదేశ్ కు చెందిన ఆకాంక్ష చతుర్వేది నాగ్పూర్లో నీట్ పరీక్ష కోసం శిక్షణ తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీల కారణంగా మే 12న నీట్ పరీక్షను కేంద్రం రద్దు చేసిన కొద్దిరోజులకే.. అంటే మే 20న ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ, ఆమె చేతిరాతతో ఉన్న సూసైడ్ నోట్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.

'అమ్మా, నాన్నా నన్ను క్షమించండి'
ఆకాంక్ష తన తల్లిదండ్రులను ఉద్దేశించి రాసిన లేఖలో మళ్లీ పరీక్ష రాయడంపై తనకున్న భయాన్ని ఎంతో ఆవేదనతో వ్యక్తపరిచింది. "అమ్మా, నాన్నా.. నేను బాగా చదువుకుని డాక్టర్ని అవుతానని మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ నాకు మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు. మొదటిసారి రాసిన నీట్ పరీక్షలో నాకు మంచి మార్కులు వస్తున్నాయి, కానీ రెండోసారి కూడా అలాగే రాస్తాననే నమ్మకం నాకు లేదు. నన్ను క్షమించండి అమ్మా, నాన్నా.. నేను అన్నింటినీ పాడుచేశాను" అని ఆమె ఆ లేఖలో పేర్కొంది.
ఆకాంక్ష తండ్రి కృష్ణ కుమార్ చౌబే మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు. తన కూతురిని డాక్టర్ని చేయడం కోసం ఆయన కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా దాదాపు రూ. 3 లక్షల అప్పు చేశారు. అంతేకాకుండా కూతురి చదువు ఖర్చుల కోసం ఆయన నాగ్పూర్లో ఒక వంటవాడిగా కూడా పనిచేశారు. ఎంతో కష్టపడి చదివిన పరీక్ష రద్దు కావడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
Meet Akanksha Chaturvedi :
— Dev (@refocus21) June 4, 2026
> Was neet student from Mauganj, MP
> Her father, Krishna Chaturvedi is a farmer
> Took a loan of ₹3 lakh
> Also took financial help from relatives
> And sent her to Nagpur
> She was preparing for NEET
> Appeared in NEET 2026
> Was very happy after… pic.twitter.com/MqVLnSoFdd
రాజకీయ దుమారం.. ప్రతిపక్షాల ఆగ్రహం
ఈ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో స్పందించడంతో ఈ ఉదంతం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆకాంక్ష కుటుంబం పడిన కష్టాలను ప్రస్తావిస్తూ.. "ఆకాంక్ష దేశానికి, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ కావాలనుకుంది. ఆమె తండ్రి అప్పు చేసి చదివించాడు. కానీ నీట్ పేపర్ లీక్ అయింది, పరీక్ష రద్దయింది. ఆ అనిశ్చితి తట్టుకోలేక ఆకాంక్ష మనకు శాశ్వతంగా దూరమైంది" అని ఆయన రాసుకొచ్చారు. దేశంలోని అవినీతి, విఫలమైన విద్యా వ్యవస్థే దీనికి కారణమని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కూడా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఐదేళ్లలో 93 మంది విద్యార్థులు బలి!
నీట్ పరీక్ష ఒత్తిడి, పేపర్ లీకేజీల కారణంగా ప్రాణాలు కోల్పోయింది కేవలం ఆకాంక్ష ఒక్కరే కాదు.. రాజస్థాన్కు చెందిన 22 ఏళ్ల ప్రదీప్ మేఘ్వాల్, బిహార్లోని పాట్నా హాస్టల్లో మరణించిన శృతి కుమారి, అలాగే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్కు చెందిన పలువురు విద్యార్థులు ఈ పరీక్ష రద్దు తర్వాత తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఓ విశ్లేషణ ప్రకారం.. గత ఐదేళ్లలో నీట్ ఒత్తిడి తట్టుకోలేక దాదాపు 93 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 2025లో అత్యధిక మరణాలు నమోదు కాగా.. 2026లో ఇప్పటివరకు 14 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మే 12న పరీక్ష రద్దు ప్రకటన వచ్చిన తర్వాతే ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
నీట్-యూజీ 2026 ఎందుకు రద్దయిందంటే?
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న నీట్ పరీక్ష జరిగింది. అయితే పరీక్ష జరిగిన వెంటనే పలు రాష్ట్రాల్లో పేపర్ లీక్, వ్యవస్థీకృత అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం మే 12న పరీక్షను రద్దు చేసి, జూన్ 21న తిరిగి పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పేపర్ లీక్ కేసును సీబీఐ విచారిస్తుండగా.. సుప్రీంకోర్టులో కూడా పలు పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications