Air India Pilot: మళ్లీ డోప్ టెస్ట్ ఫెయిలైన పైలట్- గాల్లో దీపంలా ప్రాణాలు..!
ఈ నెల 4వ తేదీన ఫుకెట్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానం మార్గ మధ్యలో ఉన్నట్లుండి 300 అడుగుల కిందకు జారిపోవడంతో ఇందులో ప్రయాణికులతో పాటు సిబ్బందికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఎయిరిండియా విమానాల భద్రతపై తీవ్ర అనుమానాలు రేకెత్తించింది. మొదట్లో దీన్ని గాల్లో ఎదురైన సమస్యగా భావించారు. కానీ ఆ తర్వాత పైలట్ తప్పిదంగా నిర్ధారించారు. సాంకేతిక సమస్యలు కూడా కారణమని కూడా చెప్తున్నారు. దీంతో పైలట్ కు డోప్ టెస్టులు నిర్వహించారు. ఇందులో తొలిసారి నిర్వహించిన టెస్టులో పాజిటివ్ గా తేలిన పైలట్ .. తాజాగా నిర్వహించిన రెండో టెస్టులోనూ దోషిగా తేలాడు.
ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన ఘటన నేపథ్యంలో పైలట్ కు నిర్వహించిన ప్రాథమిక డోప్ పరీక్షల్లో స్క్రీనింగ్ ఫలితాలకు మరింత విశ్లేషణ అవసరమని తేలింది. దీంతో మరోసారి డోప్ టెస్టుల నిర్వహణకు ఆగస్టు 9న పౌర విమానయానశాఖ ఆదేశాలు ఇచ్చింది. దీంతో సదరు పైలట్ కు మరోసారి డోప్ టెస్టు నిర్వహించారు. ఇందులోనూ అతను పాజిటివ్ గా తేలినట్లు టైమ్స్ నౌ కథనం వెల్లడించింది. ఈ ఘటనలో నలుగురు క్యాబిన్ సిబ్బందితో సహా కనీసం 17 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో విచారణ జరుపుతోంది.

మరోవైపు ఈ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు కూడా బట్టబయలయ్యాయి. విమానంలో అనేక సాంకేతిక లోపాలు, హైడ్రాలిక్ వైఫల్యాలు, కుదుపులు కూడా తలెత్తాయని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఆగస్టు 4న జరిగిన విమాన ప్రయాణంలో, ఆటో-పైలట్ మోడ్ డిస్కనెక్ట్ కావడంతో సహా విమానంలో అనేక లోపాలు తలెత్తాయని తెలుస్తోంది. విమానం కో-పైలట్ మాన్యువల్గా నియంత్రణను తిరిగి పొందిన వెంటనే, ఫ్లైట్ కంట్రోల్ స్టాల్ సందేశం వచ్చింది. పలు స్విచ్లు కొద్దిసేపు ఆగిపోయాయని, అనేక సాంకేతిక, యాంత్రిక లోపాలు తలెత్తాయని అధికారులు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించిన తర్వాత, ఆ విమానం ఢిల్లీకి బయలుదేరింది. మరోవైపు ఈ ఘటనపై ఆగ్రహంగా ఉన్న కేంద్రం.. ఎయిర్ ఇండియా సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్న క్యాంప్ బెల్ విల్సన్ ను విచారణకు హాజరు కావాలని సమన్లు పంపింది.













Click it and Unblock the Notifications