చేయూత పింఛన్లు, కుట్టు మిషన్ పథకాల దరఖాస్తు గడువు పెంపు.. ఆ రోజే లాస్ట్ డేట్
తెలంగాణ రాష్ట్రంలో చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును పెంచుతూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు సాయంత్రం 5 వరకు పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే వరుసగా 3 రోజుల పాటు ప్రభుత్వ సెలవులు రావడంతో దరఖాస్తు చేసుకునేందుకు లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజు గడువును పెంచుతూ ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన వారు తక్షణమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే అంశంపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును రేపు సాయంత్రం వరకు పొడిగిస్తున్నట్లు వివరించారు.
ఇక ఆగస్టు 15 వ తేదీన చేయూత పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పింఛన్ అర్హులకు గ్రామాల్లో రూ. లక్షా 50 వేలు అలాగే పట్టణాల్లో అయితే రూ.2 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉండాలి అని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, మూడెకరాల కంటే ఎక్కువ మాగాణి.. 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్న వారు అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తుల గడువు ఈనెల 30 వరకు పొడిగించింది. ఈ నెల 30లోగా టీజీఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 119 నియోజకవర్గాల్లో 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల మందికి ఆటోమెటిక్ కుట్టు మెషీన్లు 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు వివరించారు. ఒక్కో యూనిట్ విలువ సుమారు రూ.12 వేల వరకు ఉంటుందని తెలిపారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2.90 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పథకం కింద దరఖాస్తులు సమర్పించడం విశేషం.

ఇక 'ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే వారి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలు.. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులని అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
