AP Govt: ఏపీలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఇలా-సర్కార్ తాజా ఉత్తర్వులు..!
ఏపీలో తాజాగా కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల మేరకు అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం (AP Govt) ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఏయే భూములకు రిజిస్ట్రేషన్ ఉంటుందో, వేటికి ఉండదో స్పష్టత ఇచ్చింది. అలాగే ఆర్డీఓ, సబ్ కలెక్టర్లకు అధికారాల బదలాయింపుపైనా స్పష్టత ఇచ్చింది. వెబ్ ల్యాండ్ ఆధారంగా రిజిస్ట్రేషన్, భూవర్గీకరణ, నిషేధిత భూములపై కఠిన వైఖరి అవలంబించనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ హక్కులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టబద్ధంగా ఫ్రీహోల్డ్ చేసిన 7.85 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్లకు తక్షణం అనుమతి ఇవ్వనున్నారు. ఇప్పటికే రిజిస్టర్ అయిన 16,801 ఎకరాల భూములు భవిష్యత్ లావాదేవీలకు కూడా ఓపెన్ స్టేటస్ లో ఉంచుతారు. పొరపాటున ఫ్రీహోల్డ్ చేసిన 5,422 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములకు రిజిస్ట్రేషన్కు అనుమతి ఇచ్చారు. అలాగే ఫ్రీహోల్డ్కు అర్హత ఉన్నా ఉత్తర్వులు వెలువడని 64,143 ఎకరాలకు ప్రత్యేక ప్రక్రియ అమలు చేస్తారు. యాక్ట్ 35, చుక్కల భూముల చట్టం పరిధిలోని 17,897 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చారు.

అసైన్మెంట్ కంటే ఎక్కువగా ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో అర్హమైన విస్తీర్ణానికే ఫ్రీహోల్డ్ హక్కులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
చట్ట ఉల్లంఘనలతో ఫ్రీహోల్డ్ చేసినట్లు గుర్తించిన 38,733 ఎకరాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిర్ణయించారు. అసైనీ లేదా చట్టబద్ధ వారసుల స్వాధీనంలో లేని 25,486 ఎకరాల రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేయనున్నారు. అదనపు అసైన్మెంట్ ఆధారాలు లేని 2,87,153 ఎకరాలకు కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారు. 3,517 ఎకరాల జలవనరుల్లోని పోరంబోకు భూములపై రిజిస్ట్రేషన్ నిషేధం కొనసాగనుంది. ఇప్పటికే రిజిస్టర్ అయినా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 8,483 ఎకరాల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారు. 1,36,024.38 ఎకరాల గ్రామ సర్వీస్ ఇనాం భూములకు రిజిస్ట్రేషన్ లకు అనుమతి ఇచ్చారు. అలాగే పేదలకు కేటాయించిన వ్యవసాయ సీలింగ్ మిగులు భూములూ ఫ్రీహోల్డ్ హక్కుల పరిధిలోకి తెచ్చారు.

రాష్ట్రంలో చుక్కల భూముల్ని 3 కేటగిరీలుగా వర్గీకరించారు. కార్పొరేషన్ల పరిధి బయట ఫ్రీహోల్డ్ హక్కుల మంజూరుకు ఆర్డీఓ, సబ్-కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. ఆర్డీఓ, సబ్-కలెక్టర్ల ఉత్తర్వులపై 60 రోజుల్లో జేసీలకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇకపై ఫ్రీహోల్డ్ కోసం సచివాలయాల ద్వారా దరఖాస్తులు తీసుకుంటారు. అక్కడి నుంచి అవి ఆర్డీఓ, సబ్-కలెక్టర్లకు వెళ్తాయి. భూమి రిజిస్ట్రేషన్ సమయంలో సబ్-రిజిస్ట్రార్ వెబ్ ల్యాండ్ ఏపీఐ ద్వారా తాజా వివరాలు పరిశీలించాలి ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. వెబ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్కు అనుకూలంగా ఉంటే అనుమతి ఇస్తారు. నిషేధితంగా ఉంటే రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తారు. నాలుగు వారాల్లో వెబ్ ల్యాండ్, ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో మార్పులకు సీసీఎల్ఏకు ఆదేశాలు ఇచ్చారు. ఫ్రీహోల్డ్ నుంచి తొలగించిన అర్హమైన భూములను తిరిగి జాబితాలో చేర్చాలని కూడా ఆదేశించారు.














Click it and Unblock the Notifications
