భీమిలిపై జగన్ ఫోకస్..గంటాకు కౌంటర్ ఇదేనా-యువనేతకే ఛాన్స్..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాలు మరింత ఇంట్రెస్ట్ కలిగేలా సాగుతున్నాయి. ఇంతలా హాట్ డిబేట్ అవ్వడానికి కారణం వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరిన మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీనునే. తాను రాజీనామా చేసేవరకు కూడా భీమిలి ఇంఛార్జ్గా చిన్న శ్రీను బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేయడంతో భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ పదవి కూడా కొత్తవారితో భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి బొత్స మేనల్లుడిగా చిన్నశ్రీనుకు జగన్ పెద్ద పీఠ వేశారు. మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సడెన్గా వ్యక్తిగత కారణాల పేరుతో రాజీనామా చేయడం అక్కడ వైసీపీ క్యాడర్ను కూడా కాస్త నిస్తేజంకు గురిచేసింది. దీన్ని ఎక్కువగా సాగదీయకూడదని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ భావించినట్లు తెలుస్తోంది.
భీమిలి వైసీపీ ఇంఛార్జ్ ఎవరు..?
వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. భీమిలి నియోజకవర్గం ఉత్తరాంధ్రలోనే హాట్ సీటుగా పేరుగాంచింది. ప్రస్తుతం మాజీమంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాస్రావు భీమిలి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. పైగా భీమిలి లాంటి నియోజకవర్గంలో ఆయనకు బలమైన పట్టుంది.అలాంటి బలమైన నాయకుడిని ఢీకొట్టాలంటే వైసీపీ నుంచి వచ్చే అభ్యర్థి అంతకుమించి ఉండాలనేది జగన్ భావనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి భీమిలిలో వైసీపీ ఇంఛార్జ్గా వచ్చే అభ్యర్థి అత్యంత నమ్మకస్తులై ఉండాలని, అలా వచ్చి ఇలా వెళ్లిపోయే అభ్యర్థి అయి ఉండకూడదని వైసీపీ అధ్యక్షుడు ఫిక్స్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే అన్ని కోణాల్లో ఆలోచించి జగన్ ఒక ట్రబుల్ షూటర్లాంటి అభ్యర్థిని ఫిక్స్ చేసినట్లు వైసీపీ సర్కిల్స్లో వార్త షికారు చేస్తోంది.

ఉత్తరాంధ్రలో భీమిలి నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. భౌగోళికంగా చూస్తే ఈ మధ్యే ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భీమిలికి దగ్గరగా ఉంది. అంతేకాదు డేటా సెంటర్లు, మల్టీ నేషనల్ టెక్ కంపెనీలు, విద్యా సంస్థలు భీమిలి పరిసరాల్లోనే ఏర్పాటు కానుండటంతో ఇది ది మోస్ట్ హ్యాపెనింగ్ కాన్స్టిట్యూఎన్సీగా మారింది. అందుకే భీమిలికి ఇంతటి ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడమంటే... ఉత్తరాంధ్ర ఆర్థిక గుండెకాయపై ఆధిపత్యం సాధించనట్లే అవుతుంది. అందుకే భీమిలీ సీటుకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది.
అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన జగన్..?
2024 ఎన్నికల తర్వాత భీమిలి నియోజకవర్గపు బాధ్యతలను వైసీపీ నుంచి చిన్న శ్రీనుకు కట్టబెట్టారు జగన్. అయితే రెండేళ్లలో అక్కడ కార్యకర్తలపై పలు కేసులు నమోదైనప్పటికీ చిన్న శ్రీను వారికి అండగా నిలవలేదనే ఫిర్యాదులున్నాయి.ఇక తీరా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీని వీడి చిన్న శ్రీను పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో భీమిలిలో ఉన్న వైసీపీ క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన జగన్ భీమిలి నియోజకవర్గం బాధ్యతలు ఎవరికివ్వాలా అనే కసరత్తును ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజల్లో స్వచ్ఛమైన ఇమేజ్ ఉండి, ఒత్తిళ్లను తట్టుకుని నిలబడగలిగే ధైర్యం, ముఖ్యంగా కేడర్కు అందుబాటులో ఉండాలనే పారామీటర్స్ మీద జగన్ ఇంఛార్జ్ను నియమించనున్నారు. ఇప్పటికే ఈ పారామీటర్స్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
చిన్న శ్రీను ఎగ్జిట్ - కొత్త ఇంఛార్జ్తో క్యాడర్లో జోష్
భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్గా గుడివాడ అమర్నాథ్, కొండా రాజీవ్ల పేర్లు ప్రధానంగా ప్రచారంలో ఉన్నప్పటికీ జగన్ మదిలో మాత్రం మరో యువనేత పేరు ఉన్నట్లు సమాచారం. గంటా లాంటి సీనియర్ నేతను కౌంటర్ చేయాలంటే ఈ యువనేతే కరెక్ట్ అని జగన్తో పాటు పార్టీ కూడా బలంగా నమ్ముతోందట.ఈ మధ్యే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆ యువనేత...చిన్న శ్రీను వైసీపీలో ఉన్నప్పుడు కలిసి పనిచేశారు. ఇప్పుడు ఈ పేరును తెరపైకి తీసుకొచ్చి క్యాడర్ నుంచి అభిప్రాయం తీసుకున్నప్పుడు అంతా ముక్తకంఠంతో ఆ క్యాండిడేట్ నాయకత్వానికి ఓకే చెప్పినట్లు వైసీపీ పార్టీలో ప్రచారం జరుగుతోంది. చిన్న శ్రీను ఎగ్జిట్తో డీలా పడ్డ క్యాడర్ త్వరలో కొత్త యువనేత ఇంఛార్జ్గా రానుండటంతో తిరిగి యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. ఈ కొత్త యువనేత గంటా శ్రీనివాసరావుకు కౌంటర్ ఇవ్వగల సత్తా ఉందని తాము బలంగా నమ్ముతున్నట్లు వైసీపీ క్యాడర్ చెబుతోంది. త్వరలోనే వైసీపీ అధిష్టానం భీమిలికి కొత్త యువనేత పేరును అధికారికంగా ప్రకటించనుందట. ఇక కొత్త యువనేత రాకతో వైసీపీ ఎంతమేరకు సక్సెస్ అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.













Click it and Unblock the Notifications
