చిన్ని శ్రీను గేమ్ కు జగన్ మార్క్ ట్రీట్మెంట్, బొత్సా చెప్పినా - గోవా కేంద్రంగా...!!
విజయనగరం జిల్లా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన చిన్ని శ్రీను తన కుమార్తె సహా టీడీపీలో చేరారు. ఆయన చేరిక పైన టీడీపీ ముఖ్య నేతల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఈ సమయంలో వారిని మచ్చిక చేసుకునే పని మొదలు పెట్టారు. గోవా కేంద్రంగా మంత్రాంగం నడిపారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి మరి కొందరికి లైన్ క్లియర్ చేస్తున్నట్లు మాజీ సీఎం జగన్ కు సమాచారం అందింది. దీంతో.. జగన్ వెంటనే తన మార్క్ డెసిషన్స్ తీసుకున్నారు. మరో కీలక నిర్ణయానికి సిద్దం అయ్యారు.
విజయనగరంలో వైసీపీలో కీలక వ్యవహరించిన మజ్జి శ్రీను పార్టీని వీడారు. తన కుమార్తె కు స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వటంతో పాటుగా తన రాజకీయ భవిష్యత్ పైన వచ్చిన హామీతో టీడీపీ కండువా కప్పుకున్నారు. తొలుత జనసేనలో చేరాలని భావించారు. అయితే, గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎంపీ ఎంట్రీతో సీన్ మారింది. టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే.. తన చేరిక.. భవిష్యత్ ప్రాధాన్యత లో నష్టం జరగకుండా కుమార్తె శిరిసహస్ర తో కలిసి గోవాలో ఆ రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. గోవాలోని గవర్నర్ బంగ్లాలో చిన్న శ్రీను కుటుంబానికి అశోక్ గజపతిరాజు, టీడీపీ ఎమ్మెల్యే అదితి ఆతిథ్యం ఇచ్చారు. అయితే, చిన్ని శ్రీను తన వియ్యంకుడు.. అల్లుడిని టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారని పార్టీ నేతల సమాచారం. శ్రీను వ్యవహారం పైన కన్నబాబు, కేకే రాజు జగన్ కు నివేదిక ఇచ్చారు. దీంతో.. ఆ నివేదిక మేరకు బొత్సాతోనూ జగన్ మాట్లాడినట్లు సమాచారం.

జగన్ తాజా నిర్ణయాలతో ఒక్క సారిగా..
చిన్న శ్రీను వియ్యంకుడు.. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు సైతం పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం రావటంతో.. జగన్ ఆయన పైన చర్యలు తీసుకున్నారు. ఆయన్ను ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి నెల్లమర్ల జెడ్పీటీసీ గదల సన్యాసి నాయుడుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. తాజాగా జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయిన అప్పలనాయుడు తాను వైసీపీలోనే కొనసాగుతాను అని చెప్పారు. అయితే, జగన్ మాత్రం భవిష్యత్ అంచనాలకు అనుగుణంగానే.. అప్పలనాయుడు ను ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీని ద్వారా పార్టీ ఎవరైనా ముఖ్య నేతలు వీడినా... తన స్పందన ఏంటో ఈ నిర్ణయాల ద్వారా సంకేతాలు ఇచ్చారు. అయితే, అప్పలనాయుడు విషయంలో తొందర వద్దని బొత్సా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జగన్ తాజా నిర్ణయంతో విజయనగరం రాజకీయాల్లో చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications
