అమరావతికి భారీ గుడ్ న్యూస్..! సీడ్ యాక్సెస్ రోడ్డుపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
అమరావతి రాజధాని (Amaravati Capital) నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కూటమి సర్కార్ కు ఇవాళ మరో గుడ్ న్యూస్ అందింది. రాజధానిలోని అన్ని ప్రాంతాల్ని కనెక్ట్ చేసే విధంగా ప్రభుత్వం నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణలో కొన్ని చోట్ల రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మెరుగైన ప్యాకేజీ ఇస్తామన్నా రైతులు అంగీకరించలేదు. ప్రభుత్వ ఆదేశాలపై సదరు రైతులు హైకోర్టు(AP High Court)కు వెళ్లారు. అయితే వారి పిటిషన్లు విచారించిన హైకోర్టు.. ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.
అమరావతిలో భూసేకరణ కోసం ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం రాజధానికి అవసరమైన భూముల్ని భూసమీకరణ లేదా సేకరణ విధానంలో ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కువగా స్దానికులు భూసమీకరణకు అంగీకరించి తమ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారు. దీంతో మెజార్టీ భాగం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. అయితే మధ్యలో కొందరు రైతులు మాత్రం తమ భూములు ఇవ్వకపోవడంతో ఈ రోడ్డు మీద నుంచి రాకపోకలు సాగించేందుకు వీల్లేగుండా పోయింది. దీనిపై ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా సదరు రైతులు మాత్రం భూములివ్వకుండా కోర్టుకు వెళ్లారు. వీరి పిటిషన్లు విచారించిన హైకోర్టు వాటిని తోసిపుచ్చింది.

ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నిబంధనల ప్రకారమే జరుగుతోందని ప్రభుత్వ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. దీంతో రైతులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించడం సరికాదని భావించిన హైకోర్టు.. ఈ తీర్పు ప్రకటించింది. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కీలకమైన రోడ్డు నిర్మాణాన్ని పరుగులు తీయించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.














Click it and Unblock the Notifications