స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్..! ఉత్తర్వులు జారీ..!
ఏపీలో పనిచేస్తున్న దాదాపు లక్షన్నర మంది స్వర్ణ గ్రామం (Swarna Gramam), స్వర్ణ వార్డు (Swarna Wardu) ఉద్యోగులకు ప్రభుత్వం (AP Govt) ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (AAS) కింద ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేల్ మంజూరుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ జీఓఎంఎస్ నంబర్ 7ను జారీ చేసింది. ఇందులో ఈ ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేల్ ఎవరికి వర్తింపచేస్తారో కూడా వివరాలను ఇచ్చింది.
2019, 2020 సంవత్సరాల నియామక నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన అర్హత కలిగిన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది ఒకే పోస్టు లేదా కేడర్లో 6 సంవత్సరాల అర్హత సర్వీసు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేల్కు వారు అర్హులు అవుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే 11వ వేతన సవరణ సంఘం కింద ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్కు నిర్దేశించిన అన్ని అర్హత నిబంధనలను వారు పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఒకే పోస్టులో ప్రమోషన్ అవకాశాలు లేక సర్వీసులో కొనసాగుతున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తైనప్పుడు వారు పనిచేస్తున్న పోస్టు కంటే తర్వాత ఉన్నత వేతన స్కేల్ అయిన స్పెషల్ గ్రేడ్ పోస్టు స్కేల్ను మంజూరు చేసే విధానం అమల్లో ఉంది.

అయితే ఇప్పుడు అర్హత కలిగిన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బందికి ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేల్ మంజూరు చేసేందుకు సంబంధిత లైన్ డిపార్ట్మెంట్లు, శాఖాధిపతులు, సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ డైరెక్టర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో పౌరులకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను వారి ఇంటి వద్దకే అందించేందుకు 15,004 స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా కార్యాలయాల్లో వివిధ శాఖలకు చెందిన సిబ్బంది సేవలందిస్తున్నారు.












Click it and Unblock the Notifications
