ఏపీ ఫర్ సేల్.. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్: మాజీమంత్రి సంచలనం!
ఆంధ్రప్రదేశ్ను అమ్మకానికి పెట్టే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని మాజీమంత్రి కురసా కన్నబాబు చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీ ఫర్ సేల్.. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. ప్రజల పక్షాన నిలబడి పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ల పక్షాన నిలబడి రాష్ట్ర వనరులు, సంపదను ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోందన్నారు.
కొత్త స్కామ్కు ప్రభుత్వం తెర తీసిందన్న మాజీ మంత్రి కన్నబాబు
చంద్రబాబు చెప్పిన సంపదసృష్టి ప్రజల కోసం కాదు.. కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, తన మద్దతుదారుల కోసం అని ఇప్పుడు స్పష్టమైందన్నారు. తరతరాలకు నష్టం చేసే కొత్త స్కామ్కు ఈ ప్రభుత్వం తెర తీసిందన్నారు. కొత్త పీపీపీ 2026 విధానం సుమారు రూ.1.23లక్షల కోట్ల పెట్టుబడులు పీపీపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్లో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందన్నారు.2026-27లో పెట్టుబడిదారులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.1,500కోట్లు ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు.

ప్రజలనుంచే యూజర్ చార్జీలు వసూలు చేసే ప్లాన్
ప్రభుత్వ ఆస్తులు, వనరులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి.. వాటిపై ప్రజలనుంచే యూజర్ చార్జీలు వసూలు చేసే ద్వారాలు తెరిచారని మండిపడ్డారు. రోడ్లు, పోర్టులు, విద్య, వైద్యం, తాగునీరు, మురుగునీటి పారుదల, సాగునీరు, పబ్లిక్ భవనాలు, హౌసింగ్, టూరిజం, డేటా సెంటర్లు, పార్కులు వంటి అన్ని రంగాలను పీపీపీ కింద ప్రైవేట్కు అప్పగించే కార్యక్రమం జరుగుతోందని, పీపీపీకి ఇవ్వకుండా ప్రభుత్వం మిగిల్చిన రంగం ఏదైనా ఉందా? అన్నారు.
పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేట్కు ఇచ్చే కుట్ర
జగన్ ప్రభుత్వం నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నించారన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నం వెనక్కి వెళ్లిందన్నారు. ఇప్పుడు మళ్లీ పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేట్కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. రోడ్లను ప్రైవేట్కు అప్పగించి టోల్ వసూలు చేసే విధానాన్ని తీసుకొస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలపై పన్నులు, చార్జీలు.. ప్రైవేట్ సంస్థలకు రాయితీలు
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్, కొత్త ఇల్లు, కొత్త ఇంటి స్థలం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం విఫలమవుతోందని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. మరోవైపు ప్రైవేట్ సంస్థలకు వేలాది ఎకరాల భూములు, రాయితీలు ఇస్తోందన్నారు. ప్రజలపై పన్నులు, చార్జీలు పెంచుతూ.. ప్రైవేట్ సంస్థలకు మాత్రం భూములు, నీరు, విద్యుత్, రాయితీలు, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఏ విధమైన ప్రజా పాలన? అని ప్రశ్నించారు. పీపీపీ -2026 విధానంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్నారు.
ప్రజా ఆస్తులను ప్రైవేట్ కి అప్పగిస్తే పోరాటమే
ప్రజా ఆస్తులను, రాష్ట్ర వనరులను ప్రైవేట్కు అప్పగించే ఈ విధానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున గట్టిగా పోరాడుతామన్నారు. పీపీపీ- 2026 విధానం ప్రజాహితం కాదు. ప్రజా ప్రయోజనానికి విరుద్ధమైన ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలి లేదా ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. .













Click it and Unblock the Notifications