రేపు తమిళనాడు బంద్..? రాష్ట్రవ్యాప్తంగా హై టెన్షన్..!
తమిళనాడులో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న టీవీకే పార్టీ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆలస్యం చేస్తున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు మే 8 శుక్రవారం రోజున గవర్నర్ అధికారిక నివాసం అయిన లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.
కేవలం చెన్నైలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ కాలరాస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ ఈ మేరకు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇక గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఫలితాల అనంతరం 108 స్థానాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించిందని అలాగే కాంగ్రెస్ ఐదు సీట్లు కలిపి మెజారిటీకి దగ్గరలోనే ఉన్నామని స్పష్టం చేశారు. టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
మరోవైపు మద్దతు కూడగట్టుకునే పనిలో విజయ్ ఉన్నారు. ఈ మేరకు లెఫ్ట్ పార్టీలతో విజయ్ ప్రత్యక్షంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ కు 112 స్థానాలు ఉన్నాయి. వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు రేపు సమావేశం కానున్నాయి. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. ఇక రేపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుందోనని అంతటా ఆసక్తి నెలకొంది. సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా కాంగ్రెస్ నిరసనలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ రాష్ట్రంలో అల్లర్లు, అస్థిరత సృష్టించాలని చూస్తోందని మండిపడుతున్నాయి.

ఇదిలా ఉంటే తమిళనాడులోని రాజకీయ పరిణామాలపై రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు గవర్నర్ తీరుపై విమర్శలు గుప్పించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.












Click it and Unblock the Notifications