ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వాడకం వల్ల వాహనాలు పాడైపోతున్నాయన్న ఆందోళనలు ఓవైపు చెలరేగుతుండగా.. కేంద్రం మాత్రం దాన్ని సమర్ధించుకుంటూ రోజూ ప్రకటనలు విడుదల చేస్తోంది. అయితే ఇవాళ మాత్రం వాహనాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఓ విషయాన్ని మాత్రం అంగీకరించింది. దీంతో ఇథనాల్ వాడకం విషయంలో వినియోగదారులకు కూడా ఓ క్లారిటీ వచ్చినట్లయింది.
20 శాతం ఇథనాల్ (E20) కలిపిన పెట్రోల్ కొన్ని వాహనాల్లో ఇంధన సామర్థ్యాన్ని 3-5 శాతం వరకు తగ్గించగలదని చమురు మంత్రిత్వ శాఖ ఇవాళ స్పష్టత ఇచ్చింది. అయితే, ఈ ప్రభావం కంటే అధిక ఆక్టేన్ రేటింగ్, మెరుగైన యాంటీ-నాక్ లక్షణాలు, వేగవంతమైన దహనం, మెరుగైన పికప్, సున్నితమైన త్వరణం, శుభ్రమైన ఇంజిన్ పనితీరు ,తక్కువ జీవితకాల కార్బన్ ఉద్గారాలు వంటి ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర వాదిస్తోంది.
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమంపై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి జారీ చేసిన ఒక వివరణాత్మక పత్రంలో
పెట్రోలియం ,సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, E10 లేదా స్వచ్ఛమైన పెట్రోల్ కంటే E20 ఒక "శుభ్రమైన, అధిక-నాణ్యత గల, మరింత సమర్థవంతమైన ఇంధనమని పేర్కొంది. అలాగే సంవత్సరాల తరబడి శాస్త్రీయ పరీక్షలు, ఆటోమొబైల్ తయారీదారులతో సంప్రదింపులు ,దేశీయ ఇథనాల్ ఉత్పత్తి విస్తరణ తర్వాత మాత్రమే దీనిని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.
ఈ కార్యక్రమాన్ని చాలా తొందరగా అమలు చేశారన్న ఆందోళనలను మాత్రం చమురు శాఖ తోసిపుచ్చింది. భారతదేశపు ఇథనాల్ మిశ్రమం కార్యక్రమం 2001లో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టుల నుండి మొదలైందని, 2006 నాటికి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5 శాతం మిశ్రమాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేసింది.