పెట్రోల్ కోసం 18 గంటలుగా లైనులోనే.. ఇదీ అక్కడి ప్రజల పరిస్థితి..!
పెట్రోల్ కావాలంటే లైను కట్టాల్సిందే. బంకుల వద్ద దాదాపు 18 గంటలు లైనులో నిలబడితేనే పెట్రోల్ దొరుకుతుంది. పెద్ద పెద్ద క్యూలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ దృష్ట్యా పెట్రోల్ బంకుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇదీ అక్కడి ప్రజల పరిస్థితి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన రష్యా పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. నిన్నటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి, ఎగుమతిదారుగా ఉన్న రష్యాలో ఇప్పుడు అనూహ్యంగా చమురు సంక్షోభం తలెత్తింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చమురు కోసం ప్రజలు బంకుల వద్ద దాదాపు 18 గంటలుగా లైనులోనే ఎదురు చూస్తున్నారు.
ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఉక్రెయిన్.. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. అనేక కర్మాగారాలను ధ్వంసం చేసింది. గత కొన్ని వారాలుగా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ దాడులకు రష్యాలోని ఎనర్జీ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో చమురు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. రష్యాలో చమురు నిల్వలు భారీగానే ఉన్నా.. ఈ దాడుల కారణంగా దేశంలోని ప్రజలకు చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. అటు ఉక్రెయిన్ మాత్రం రష్యాలోని చమురు సంస్థలే టార్గెట్ గా డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది.
అధికారుల సమాచారం ప్రకారం.. దేశంలోని నాలుగో అతిపెద్ద చమురు రిఫైనరీ సంస్థ అయిన నోర్సీ రిఫైనరీపై ఉక్రెయిన్ వరుసగా దాడులు చేపట్టింది. దాంతో రిఫైనరీ సంస్థలోని అనేక స్థావరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో జూలై 2 లోపే ఆ సంస్థ పెట్రోల్, డీజిల్ విక్రయాలను పూర్తి చేయాల్సి వచ్చింది. దాంతో డ్రోన్ దాడుల కారణంగా మూతపడిన ఐదో చమురు శుద్ధి కర్మాగారం అని తెలుస్తోంది. వీటిని మళ్లీ పునరుద్ధరించాలంటే మరో ఏడాది సమయం పడుతుందని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. మిగతా చమురు శుద్ధి కర్మాగారాలైన గజ్ ప్రోమ్ నెఫ్ట్స్ మాస్కో రిఫైనరీ, వోల్గా గ్రాడ్ రిఫైనరీ, క్యూబీషెవ్ రిఫైనరీ, టనేకో రిఫైనరీలను కూడా మూసివేసినట్లు సమాచారం. దాంతో చమురు కోసం అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై సోమవారం తెల్లవారుజామున రష్యా భీకర దాడులు చేపట్టింది. టర్కీలో నాటో సమావేశం నేపథ్యంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కీవ్ నగరంపై బాలిస్టిక్ మిసైల్స్ తో జరిపిన ఈ దాడుల్లో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక భవంతులు దెబ్బతిన్నాయి.












Click it and Unblock the Notifications