మేహుల్ చోక్సీకి బిగుస్తోన్న ఉచ్చు: తీగ లాగిన లండన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ చుట్టూ ఉచ్చ బిగుసుకుంటోన్నట్టే కనిపిస్తోంది. పీఎన్బీలో 13,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసానికి పాల్పడిన మేహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి కరేబియన్ ద్వీపదేశం అంటిగ్వా అండ్ బార్బుడాలో నివసిస్తోన్నారు.
2017లో వారికి ఆ దేశ పౌరసత్వం కూడా లభించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉండటం వల్ల మేహుల్ చోక్సీని భారత్కు తీసుకుని రావడానికి సీబీఐ, ఈడీ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ఈ కుంభకోణంలో ఆయన భార్య ప్రీతి చోక్సీ పేరు కూడా బయటికి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఆమె పేరును దర్యాప్తు జాబితాలో చేర్చింది. ఇదివరకే ఛార్జ్షీట్ను నమోదు చేసింది.

ఈ పరిణామాల మధ్య మేహుల్ చోక్సీ అడ్వొకేట్ విజయ్ అగర్వాల్ అరెస్ట్ అయ్యారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయనను బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మేహుల్ చోక్సీకి విజయ్ అగర్వాల్ ప్రధాన న్యాయవాదిగా వ్యవహరిస్తోన్నారు. లండన్లోని అత్యంత ఖరీదైన మేఫెయిర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా వీసా పరిమితులను ఉల్లంఘించారనే ఆరోపణలపై బ్రిటన్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
మేఫెయిర్లోని ఓ లగ్జరీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ భవన యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు జరిగాయని అక్కడి మీడియా వెల్లడించింది. ఆ సమయంలో అగర్వాల్తో పాటు ఆయన లా సంస్థకు చెందిన కొందరు జూనియర్ అసోసియేట్ లాయర్లు కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం భారత్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎలాంటి వర్క్ పర్మిట్ లేకుండా బ్రిటన్ లో వృత్తిపరమైన కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఆరోపణలను విజయ్ అగర్వాల్ ఎదుర్కొంటోన్నారు. ఈ కోణంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పర్యాటక వీసాలపై యూకేకు వచ్చి అక్కడ వ్యాపార లేదా అధికారిక కోర్టు పనులను నిర్వహించడం అక్కడి చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. ఈ తనిఖీల్లో భారీగా నగదు సైతం దొరికినట్లు వార్తలు వస్తోన్నాయి. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న మూలాలు ఏమిటనే దానిపై విచారణ కొనసాగుతోంది.
భారత్ లో అత్యంత క్లిష్టమైన కార్పొరేట్ నేరాలు, పెద్ద ఎత్తున జరిగిన ఆర్థిక మోసాల కేసులను వాదించడంలో విజయ్ అగర్వాల్కు దశాబ్దాల అనుభవం ఉంది. పీఎన్బీ స్కామ్తో పాటు దేశంలో సంచలనం సృష్టించిన అనేక ఇతర ఆర్థిక కుంభకోణాల కేసులలోనూ డిఫెన్స్ లాయర్గా ఆయన బలమైన వాదనలు వినిపించారు. వేర్వేరు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో మెహుల్ చోక్సీ తరఫున ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.














Click it and Unblock the Notifications