ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్న ఆగ్రాలోని పురాతన కట్టడం తాజ్ మహల్ (Taj Mahal) గతంలో శివాలయమంటూ కొత్తగా మరో వాదన బయలుదేరింది. ఈ మేరకు తాజ్ మహల్ లో పురావస్తుశాఖ సర్వే నిర్వహిస్తే ఈ విషయం బయటపడుతుందని, కాబట్టి ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్రం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.
తాజ్ మహల్ వాస్తవానికి శివునికి అంకితం చేసిన తేజో మహాలయ అనే హిందూ దేవాలయం అని పేర్కొంటూ దాఖలైన ఓ సివిల్ దావాకు సంబంధించి, తాజ్ మహల్ను తనిఖీ చేయడానికి , ఫోటోలు తీయడానికి ఒక అడ్వకేట్ కమిషనర్ను నియమించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై కేంద్రం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పందనలను కోరుతూ, కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
తాజ్ మహల్ను పరిశీలించడానికి అడ్వకేట్ కమిషనర్ ను నియమించేందుకు ట్రయల్ కోర్ట్, రివిజనల్ కోర్ట్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ శ్రీ అగ్రీశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ విరాజ్మాన్ తేజో మహాలయ ఆలయ దైవం తరపున హరి శంకర్ జైన్, ఇతరులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ వివాదం 2015లో ఆగ్రాలో దాఖలైన ఒక సివిల్ దావాతో మొదలైంది. ఆ దావాలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనలో ముంతాజ్ మహల్ సమాధిగా మార్చడానికి ముందు, తాజ్ మహల్ వాస్తవానికి శివునికి అంకితం చేసిన తేజో మహాలయ అనే హిందూ ఆలయమని హరి శంకర్ జైన్, ఇతర భక్తులు వాదిస్తున్నారు. అది హిందూ ఆలయమేనని ధృవీకరించాలని, అలాగే ఆ కట్టడం లోపల హిందువులు దర్శనం, పూజ మరియు హారతి నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. తమ వాదనకు మద్దతుగా నిర్మాణపరమైన, వాస్తుశిల్ప సంబంధిత అంశాలను నమోదు చేయడానికి తాజ్ మహల్ పరిశీలన అవసరమని పిటిషనర్లు కోరుతున్నారు. కేవలం మౌఖిక సాక్ష్యాల ద్వారా అలాంటి ఆధారాలను సమర్థవంతంగా నిరూపించలేమని వాదిస్తున్నారు. తాజ్ మహల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆధ్వర్యంలో ఉన్న సంరక్షిత కట్టడం కాబట్టి, ట్రయల్ కోర్ట్ ముందు తాము ఆధారాలుగా చూపించాలనుకుంటున్న భాగాలను స్వతంత్రంగా పరిశీలించడం లేదా ఫోటోలు తీయడం తమకు సాధ్యం కాదని వారు పేర్కొంటున్నారు. కాబట్టి తాజ్ మహల్ను పరిశీలించి, ఫోటోలు, వీడియోలు తీసి, ఆ నివేదికను ట్రయల్ కోర్ట్కు సమర్పించేందుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించాలని కోరుతూ పిటిషనర్లు 2017లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే కమిషనర్ను నియమించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ట్రయల్ కోర్టు 2019 జూలైలో ఈ దరఖాస్తును తిరస్కరించింది. ఆగ్రాలోని అదనపు జిల్లా జడ్జి 2026 ఏప్రిల్ 4న ఆ నిర్ణయాన్ని ధృవీకరించారు. దీంతో పిటిషన్లు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.