చదువుల తల్లికి లక్ష్మీ కళ.. 49రోజుల్లో కోటి దాటిన హుండీ ఆదాయం!

తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం. బాసర సరస్వతి అమ్మవారి దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఈ ఆలయానికి విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అటువంటి బాసర సరస్వతి అమ్మవారి ఆలయం తాజాగా ఒక రికార్డును సృష్టించింది. అసాధారణమైన ఆదాయ స్థాయిని నమోదు చేసింది.

Advertisement

49 రోజులలో అమ్మవారి హుండీ ఆదాయం ఎంతంటే

మే 13వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు మొత్తం 49 రోజుల కాలవ్యవధిని అమ్మవారి ఆలయ హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలు, నగదు ఒక కోటి ఆరు లక్షల 45 వేల 390 రూపాయలు అని అధికారులు వెల్లడించారు. కేవలం 49 రోజుల వ్యవధిలో కోటి రూపాయలకు పైగా అమ్మవారి హుండీ ఆదాయం పెరగడం విశేషమని చెబుతున్నారు.

Advertisement

దేశ విదేశాల నుండి బాసర ఆలయానికి భక్తులు

జ్ఞాన సరస్వతి అమ్మవారి పట్ల భక్తులలో ఉన్న అపారమైన నమ్మకానికి, భక్తికి ఈ హుండీ ఆదాయం నిదర్శనంగా నిలుస్తుందని చెబుతున్నారు. బాసర సరస్వతి అమ్మవారి దేవాలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా విదేశాలలో నివసిస్తున్న ఎన్నారైలు కూడా వస్తూ ఉంటారు. ఈ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. లెక్కించిన హుండీల ఆదాయంలో కేవలం నగదు మాత్రమే కాకుండా ఇతర వస్తువులు కూడా బయటపడ్డాయి.

నగదు మాత్రమే కాదు బంగారు, వెండి వస్తువులు కూడా

సుమారు 78 గ్రాముల బంగారం, నాలుగు కేజీల వెండి ఆభరణాలు, 17విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయి. బాసర అమ్మవారికి భక్తులు వారు అనుకున్నమేరకు వారి సామర్థ్యానికి అనుగుణంగా బంగారు, వెండి నగలను సమర్పిస్తూ, తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇటీవల బాసర అమ్మవారి ఆలయానికి హుండీ ఆదాయంతో పాటు, ఇతరత్రా వస్తువులు కూడా పెద్దసంఖ్యలో రావడంతో ఈ ఆదాయం అమ్మవారి ఆలయ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉందన్న ఆలయ ఈవో

బాసర ఆలయ ఈవో అంజనాదేవి భక్తుల సంఖ్య బాగా పెరిగిందని, అందుకే అమ్మవారికి ఆలయానికి ఈ ఆదాయం సాధ్యమైందని తెలిపారు. అంతేకాదు వచ్చే శ్రావణమాసం మరియు దేవీ నవరాత్రుల సందర్భంగా మరింత ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని దీంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంచనా వేశారు.

భక్తులకు మరిన్ని వసతులను కల్పిస్తామన్న ఈవో

ఇక ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మరిన్ని వసతులు కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ సరస్వతి ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఆలయం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం. తాజాగా అమ్మవారి హుండీ ఆదాయం అమ్మవారి విశిష్టతను స్పష్టంగా చెబుతుంది.

English Summary

Basara Gnana Saraswathi Temple in Telangana's Nirmal district has witnessed record hundi collections of Rs 1.06 crore in 49 days from May 13 to July 1.