డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. ఆ ఛార్జీల రద్దు!

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆర్థిక వెసులుబాటును కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల పొదుపు మహిళలు బ్యాంకులనుంచి తీసుకునే జీవనోపాధి రుణాలపై విధించే అదనపు ఛార్జీలను రద్దు చేయడం ద్వారా వారిపై మోయలేని భారాన్ని తగ్గించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ అదనపు ఛార్జీల మినహాయింపును అమలు చేస్తున్నాయి.

Advertisement

రద్దయిన ఛార్జీలు - పూర్తి వివరాలు

సాధారణంగా స్వయం సహాయక సంఘాలు బ్యాంకులనుంచి రుణాలు పొందే సమయంలో బ్యాంకులు రెండు రకాల రుసుములను వసూలు చేస్తాయి. ప్రాసెసింగ్ ఛార్జీలు.. ఇవి రుణ దరఖాస్తును పరిశీలించి, మంజూరు చేయడానికి అయ్యే ఖర్చు. ఇన్‌స్పెక్షన్ ఛార్జీలు ఇవి రుణం పొందే సంఘాల క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం విధించే రుసుము. ఇప్పటివరకు ఈ ఛార్జీల కారణంగా డ్వాక్రా మహిళలపై దాదాపు ఒక శాతం వరకు అదనపు ఆర్థిక భారం పడేది.

Advertisement

సీఎం చంద్రబాబు ఆదేశాలతో చార్జీలను రద్దు చేసిన బ్యాంకులు

మహిళలు తక్కువ వ్యయంతో రుణాలు పొంది, స్వయం ఉపాధి సాధించాలనే ప్రభుత్వ ఆశయానికి ఇది ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు ఈ ఛార్జీలను పూర్తిగా రద్దు చేశాయి.

చార్జీల రద్దుతో మహిళలకు ఆర్థికలబ్ధి

ఈ నిర్ణయం వల్ల పొదుపు సంఘాల మహిళలకు గణనీయమైన మొత్తంలో డబ్బు ఆదా కానుంది. ఒక డ్వాక్రా సంఘం రూ. 20 లక్షల వరకు క్యాష్ క్రెడిట్ లోన్ తీసుకుంటే, గతంలో ఛార్జీల రూపంలో కట్టాల్సిన దాదాపు రూ. 33,000 ఆదా అవుతుంది. మూడేళ్ల రుణ కాలపరిమితి ముగిసేసరికి ఒక్కో సంఘానికి సుమారు రూ. 93,500 వరకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.

Advertisement

ప్రతీ మహిళకు లోన్ పూర్తయ్యే నాటికి దాదాపు 10వేల లబ్ది

ఒక సంఘంలో 10 మంది మహిళలు ఉంటే, ఈ నిర్ణయం వల్ల ప్రతి మహిళకు సుమారు రూ. 3,300 వార్షికంగా, అలాగే లోన్ పూర్తయ్యేనాటికి సుమారు రూ. 9,900 వరకు ఆదా అవుతుంది.
యూనియన్ బ్యాంక్ ఒక్కదాని పరిధిలోనే ఉన్న దాదాపు 1.75 లక్షల డ్వాక్రా సంఘాలకు ఒక ఏడాదిలోనే దాదాపు రూ. 586.25 కోట్ల లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.

తక్కువ ఖర్చుతో బ్యాంకుల నుంచే సులభంగా రుణాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయ తలపెట్టిన ఒక్కో కుటుంబం - ఒక్కో పారిశ్రామికవేత్త అనే లక్ష్య సాధనకు ఈ అదనపు ఛార్జీల రద్దు నిర్ణయం ఎంతో దోహదపడుతుంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద మహిళలు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా, తక్కువ ఖర్చుతో బ్యాంకుల నుంచే సులభంగా రుణాలు పొందేందుకు ఈ వెసులుబాటు భరోసానిస్తుంది.

English Summary

Good news to dwcra women. AP Government under CM Chandrababu directs banks to waive processing and inspection charges on DWCRA loans. Check how much money each SHG group can save now.