తెలంగాణా రాష్ట్రంలో వైద్యరంగ ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసి సహకరిస్తున్న క్రమంలో ఆస్పత్రులు అద్భుత విజయాలను నమోదు చేస్తున్నాయి. తాజాగా నిమ్స్ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. ఇటీవల నిమ్స్లో 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి రికార్డ్ సృష్టించగా, తాజాగా రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే నిమ్స్ హాస్పిటల్ 1,000 రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు.
ఆరోగ్య శాఖామంత్రిని కలిసిన నిమ్స్ డైరెక్టర్, అభినందించిన మంత్రి
నేడు సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని కలిసిన డాక్టర్ రాహుల్ దేవరాజ్, నిమ్స్ సాధించిన ఈ ఘనతను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్తో పాటు రొబోటిక్ సర్జరీల్లో భాగస్వాములైన డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిమ్స్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
ఇటీవలే నిమ్స్లో 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తవడం, ఇప్పుడు 1,000 రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవడం ప్రభుత్వ వైద్యరంగ సామర్థ్యానికి నిదర్శనమని మంత్రి అన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించిన నిమ్స్, దేశంలోనే ప్రముఖ అవయవ మార్పిడి కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సేవలను మరింత విస్తరిస్తోందని, ప్రస్తుతం నిమ్స్తో పాటు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా రొబోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న కొత్త టిమ్స్ హాస్పిటళ్లతో పాటు గాంధీ, కొత్త ఉస్మానియా హాస్పిటల్లోనూ అత్యాధునిక రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేసి, ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ రంగంలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. నిమ్స్లో ఇప్పటివరకు నిర్వహించిన వెయ్యి రొబోటిక్ సర్జరీల్లో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 248, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధివంటి ప్రభుత్వ పథకాల ద్వారా రోగులకు పూర్తిగా ఉచితంగా నిర్వహించడం విశేషమని తెలిపారు. దీంతో ఖరీదైన రొబోటిక్ సర్జరీలను కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగామని చెప్పారు. ఈ విజయానికి యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, అనస్థీషియా విభాగాలు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందం, ఇతర సహాయక విభాగాల సమిష్టి కృషి కారణమని డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలను నమోదు చేసే దిశగా పని చేస్తామన్నారు.దేశంలోనే ప్రముఖ అవయవ మార్పిడి కేంద్రాల్లో ఒకటిగా నిమ్స్ ఉందన్న మంత్రి
ఈ హాస్పిటల్స్ లోనూ రోబోటిక్ సర్జరీలు
ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా రోబోటిక్ శస్త్ర చికిత్సలు: నిమ్స్ డైరెక్టర్
హైదరాబాద్ లో రాత్రికి భారీవర్షాలు.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు: సీపీ సజ్జనార్
సామాన్య ప్రజలకు అందుబాటులో ఖరీదైన రొబోటిక్ సర్జరీలు