AP 2024: ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..
ఏపీలోని ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ఆర్జియూకేటీ పరిధిలోని శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో 2024 విద్యాసంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో ప్రవేశాలు పొందాలనుకునేవారు ఈ నెల 8న ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్లలో ప్రవేశాలకు ప్రతి సంవత్సరం మూడు సార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత కౌన్సెలింగ్కు పిలుస్తారు. వీటికి అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుంది.
మే 8వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించొచ్చు. అభ్యర్థులు అప్లయ్ చేసేందుకు https://www.rgukt.in/index.php ఈ వెబ్సైట్ను సంప్రదించగలరు. ఇక, జూలై 1 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో సీట్లు పొందిన అభ్యర్థులు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సు చేయాల్సి ఉంటుంది. నాలుగు క్యాంపస్లలో కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో కలవు. ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇందులో ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద సీట్లు కేటాయించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు (RGUKT AP)-2024
మొత్తం సీట్ల సంఖ్య : 4,400.
ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్
క్యాంపస్లు : నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు.
కాలం : ఆరేళ్లు (పీయూసీ రెండేళ్లు, బీటెక్ నాలుగేళ్లు)
విద్యార్హత : ఈ ఏడాది నిర్వహించిన పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా మాత్రమే ఈ ప్రవేశాలకు ఎంపిక చేస్తారు.












Click it and Unblock the Notifications