నిర్మలమ్మ ఓపెన్ టాక్! డిగ్రీలు వస్తున్నాయి.. ఉద్యోగాలు రావడం లేదు.
దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లభించకపోవడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. భారత విద్యావ్యవస్థపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియన్స్ ఎక్స్ప్రెస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలు ఈ తీవ్రమైన సమస్యను మరొకసారి ఎత్తిచూపాయి. కళాశాలలు విద్యార్థులకు కేవలం డిగ్రీలను మాత్రమే అందిస్తున్నాయని, కార్పొరేట్ రంగానికి లేదా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలను నేర్పించడంలో విఫలమవుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. దీంతో కోట్లలో యువత ఉద్యోగాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇటీవల వెలువడిన అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, విద్యార్హతలు కలిగిన యువత పెరిగిన వేగంతో ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. 2004 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో డిగ్రీ పూర్తి చేసిన వారి సంఖ్య 4.9 కోట్ల నుంచి ఏకంగా 14.9 కోట్లకు పెరిగింది. అంటే ఏటా సగటున 50 లక్షల మంది కొత్తగా డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. అయితే, వారికి సరిపోయే స్థాయిలో ప్రతి ఏటా లభిస్తున్న ఉద్యోగాలు కేవలం 28 లక్షలు మాత్రమే. అందులోనూ స్థిరమైన జీతం లభించే సరైన ఉద్యోగాలు సంవత్సరానికి 17 లక్షల మందికి మాత్రమే దక్కుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నైపుణ్యాల కొరత.. అర్హతకు తగ్గ ఉద్యోగాలు దక్కని వైనం!
ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం, భారత్లోని డిగ్రీ విద్యార్థుల్లో కేవలం 55 శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హత కలిగిన నైపుణ్యాలను కలిగి ఉన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ వంటి సాంకేతిక రంగాలలో ఈ లోపం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నత చదువులు పూర్తి చేసిన ప్రతి పదిమందిలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే తమ చదువుకు తగిన స్థాయి ఉద్యోగాలు దక్కుతుండగా.. 50 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు తమ అర్హత కంటే తక్కువ స్థాయి పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రైవేట్ రంగంలో పోటీని తట్టుకోలేక చాలామంది స్వయం ఉపాధి లేదా చిన్నచిన్న ఉద్యోగాల వైపే మొగ్గుచూపుతున్నారు.
హరించుకుపోతున్న యువ భారత్ సమయం!
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు కలిగిన దేశంగా ప్రసిద్ధి చెందింది. సగటు వయస్సు 28 నుంచి 29 ఏళ్లు ఉన్న ఈ శ్రామిక శక్తి దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవాల్సిన సమయమిది. ప్రస్తుతం 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత సంఖ్య దాదాపు 36.7 కోట్లుగా ఉంది. అయితే రాబోయే పదేళ్లలో అంటే 2030 తర్వాత దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగి, యువత శాతంలో తగ్గుదల ప్రారంభమవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. లభించిన ఈ స్వల్ప వ్యవధిలోనే విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి, నైపుణ్యాభివృద్ధిని పెంచకపోతే దేశ ఆర్థిక పురోగతికి ఊహించని విఘాతం కలుగుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications