టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ: 13 మంది అరెస్ట్, ప్రధాని నిందితుడు సస్పెండ్, పరీక్షలు ఎలా?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీకేజీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పేపర్ లీకేజీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు, టీఎస్ పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. ఓ యువతి సోదరుడి కోసం టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుక అనే యువతి తన తమ్ముడి కోసం పేపర్ లీక్ చేయించిందని తేల్చారు.
టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ను సస్పెండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్డీఏలో టెక్నికల్ అసిస్టెంట్ ఢాక్య, కానిస్టేబుల్ శ్రీనివాస్ను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపైనా మరో రెండ్రోజుల్లోగా అధికారికంగా చర్యలు తీసుకోనున్నారు.

మరోవైపు, గతంలో నిర్వహించిన ప్రశ్నపత్రాలు కూడా లీక్ అయ్యాయా? అన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఫిబ్రవరి 25 లేదా 28న పరీక్షా పత్రాలకు సంబంధించిన ఫోల్డర్ డౌన్ లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పోలీసులు పంపించారు. ఆ నివేదిక వస్తే మరిన్ని విషయాలు బయటపడనున్నాయి. ఫోల్డర్ ను ఎప్పుడు డౌన్లోడ్ చేశారన్న ఆధారాలు లభిస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ప్రధాన నిందితుడు ప్రవీణ్ ఫోన్లో మహిళల నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నట్లు సమాచారం. అతని ఫోన్ ను కూడా ఫోరెన్సిక్ పంపారు పోలీసులు.

అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు జరిగిన రాత పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు బయటపడటంతో టీఎస్పీఎస్సీ.. మంగళవారం అత్యవసర సమావేశం కానుంది. పరీక్షను రద్దు చేయాలా? లేక, ఇద్దరికే లీకైన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సాధ్యాసాధ్యాలను, న్యాయ నిపుణుల సలహాలు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలను రద్దు చేసినట్లు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications