'పుష్ప2'పై అదిరిపోయిన మెగా వ్యూహం... వెనకున్న శక్తి ఎవరు?
కొన్నాళ్లుగా మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్థలు పెద్దవవుతున్నాయనే విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఆ తర్వాత, అంతకుముందు జరిగిన సంఘటనలు.. అటువైపు, ఇటువైపు మాట్లాడిన మాటలు కూడా రెండువైపులా ఉన్నవారిని రెచ్చగొట్టేలా ఉన్నాయి. అందుకు తగినట్లుగానే అల్లు అర్జున్ ఆర్మీకి, మెగా అభిమానుల మధ్య కూడా హోరాహోరీగా యుద్ధం నడుస్తోంది. ఇటువంటి తరుణంలోనే పుష్ప2ను డిసెంబరుకు వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా వచ్చేనెల ఐదోతేదీన విడుదల కాబోతోంది.
కేవలం గేమ్ ఛేంజర్ గురించే చర్చ
ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదల చేయనున్నారు. అఖిల భారత చిరంజీవి యువత సమావేశం ఒకటి హైదరాబాద్ లో జరిగింది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన చర్చలు మాత్రమే జరుగుతాయని పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే ఈ సమావేశంలో పుష్ప2 సినిమాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అఖిల భారత చిరంజీవి యువత వ్యతిరేకంగా పనిచేయాలని, ఈ సినిమాను అసలు పట్టించుకోకూడదంటూ అన్ని జిల్లాల అసోసియేషన్లకు ఇక్కడి నుంచి సమాచారం ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై అఖిల భారత చిరంజీవి యువత నాయకులు సీరియస్ అయ్యారు. తాము ముందు చెప్పినట్లుగానే గేమ్ ఛేంజర్ గురించి మాత్రమే చర్చించామని, పుష్ప2 గురించి కాదన్నారు.

విజయవాడ కార్యక్రమానికి హాజరైన యువత నాయకులు
విజయవాడలో పుష్ప2 కటౌట్ కు సంబంధించిన కార్యక్రమం జరిగితే దానికి అఖిల భారత చిరంజీవి యువత నాయకులు హాజరయ్యారు. తామంతా ఒకటేనని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, గిట్టనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ యువత నాయకులు చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగారు. యువత నాయకులతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. సమావేశాల్లో పుష్ప2 గురించి తాము ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, అసలు చర్చ అనేదే జరగలేదని, కేవలం గేమ్ ఛేంజర్ గురించి మాత్రమే చర్చ నడిచిందని, పుష్ప2 గురించి అలా అని, ఇలా అని వార్తలు రావడం బాధాకరమన్నారు. మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య కావాలనే దూరాన్ని పెంచేలా ఇటువంటి ప్రచారం చేస్తున్నారన్నారు. దీనివెనక ఎవరు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమేనని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చిరంజీవి యువత నాయకులు మరోసారి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications