చిరంజీవి - నాగార్జున కాంబోలో మిస్ అయిన బ్లాక్బస్టర్
మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఒకటి తెలుగు ప్రేక్షకులకు దూరమైంది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. ఇటువంటి తరుణంలో ఎవరికి వారుగా సినిమాలు చేయడానికే మొగ్గుచూపారుకానీ మల్టీస్టారర్ సినిమాలవైపు ఆసక్తి చూపించలేదు. ఒక హీరో ఎక్కువగా కనపడి, మరో హీరో తక్కువగా కనపడితే అభిమానులు బాధపడతారనే ఉద్దేశంతో వారెవరూ మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. కానీ వారికి ముందుతరం హీరోలు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటివారు ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. వారికి లేని భేషజాలు వీరికెందుకో ఎవరికీ తెలియదు.
తెలుగు ప్రేక్షకులకు దూరమైన అద్భుతమైన అవకాశం
1990లో ఈ హీరోలు బిజీగా ఉన్న తరుణంలో అప్పుడు మంచి స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఈవీవీ సత్యనారాయణ చిరంజీవితో అల్లుడా మజాకా సినిమా చేయగా, నాగార్జునతో హలో బ్రదర్ చేశారు. వీరిద్దరితో మల్టీస్టారర్ చేద్దామని ఈవీవీ ప్రయత్నించారు. స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. ఎందుకనోకానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. అనుకున్న విధంగా కథ ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేసేవిధంగా లేకపోవడంతో దీన్ని పక్కన పెట్టేశారు. అలా వీరిద్దిరి కాంబోలో మల్టీస్టారర్ చూసే అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులు దూరం చేసుకున్నారు. నిజ జీవితంలో కూడా చిరంజీవి, నాగార్జున చాలా సన్నిహితంగా ఉంటారు. ఇద్దరూ కలిసి వ్యాపారాలు చేస్తుంటారంటారుకానీ వాస్తవాలు తెలియదు.

100వ సినిమాకు నాగార్జున సన్నాహాలు
ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ దర్శకులు చెబుతున్న కథలను వింటున్నారు. ఈలోగా కుబేర, కూలీ లాంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కూలీలో ప్రతినాయకుడిగా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర వస్తుందా? రాదా? అనే విషయంలో స్పష్టత లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications