ఆ టాలీవుడ్ నటుడి కుటుంబానికి మెగాస్టార్ భారీ సాయం
తెలుగు సినీ రంగంలో కష్టాల్లో ఉన్న తోటి కళాకారులు, సినీ కార్మికులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మరోసారి ఆయన తన పెద్ద మనసును చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆ కుటుంబానికి తనవంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు..కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ తో పాటు పలు సినిమాల్లో నటించారు రమేష్. కొద్దిరోజుల కిందట తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు డాక్టర్లు అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. రమేష్ ఆరోగ్య పరిస్థితి విషయంలో చిరంజీవి స్వయంగా జోక్యం చేసుకున్నారు. అక్కడ చికిత్స అందిస్తున్న సీనియర్ డాక్టర్ సుబ్బారెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. రమేష్కు అందుతున్న చికిత్స విధానాన్ని నిశితంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ కష్ట సమయంలో వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో చిరంజీవి ముందడుగు వేశారు. రమేష్ కుటుంబ సభ్యులను కలిశారు. వ్యక్తిగతంగా వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ట్రీట్మెంట్ కోసం మూడు లక్షల రూపాయల చెక్కును రమేష్ భార్యకు అందజేశారు. అధైర్య పడవద్దని, తామంతా ఉన్నామని ఆ కుటుంబానికి నైతిక మద్దతు ఇచ్చారు. ప్రభుత్వ పరంగా కూడా రమేష్ కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకు చిరంజీవి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆరోగ్య బీమా పథకం ద్వారా రమేష్ వైద్యానికి తగిన ఆర్థిక రాయితీ లేదా ఉచిత చికిత్స అందేలా చర్యలు తీసుకంటానని మెగాస్టార్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. జనసేన పార్టీ నాయకుడు, ఏపీ శాసన మండలి సభ్యుడు నాగబాబు కూడా ఈ సహాయక చర్యల్లో భాగస్వామ్యం అయ్యారు. శనివారం ఆయన స్వయంగా రమేష్ కుటుంబ సభ్యులను కలిసి రెండు లక్షల రూపాయల మొత్తంతో కూడిన చెక్కును అందజేశారు.
చిత్రపరిశ్రమలో చిన్న కళాకారులకు సరైన ఆర్థిక స్థిరత్వం ఉండదనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి ఆపత్కాలంలో చిరంజీవి చూపిస్తున్న చొరవ, తోటి నటీనటుల పట్ల ఆయనకు ఉన్న ఆత్మీయతను, అంకితభావాన్ని చాటుతోంది. గతంలో కూడా గుండు హనుమంతరావు వంటి ఎంతోమంది నటులు, జర్నలిస్టులు, కళాకారుల వైద్య ఖర్చులను భరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications