అమరావతిపై చంద్రబాబు కీలక నిర్ణయం.. 'ఆమె'కు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను మళ్లీ మొదలుపెట్టబోతోంది. ఈ మేరకు క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి (సీఆర్డీయే) కొత్త కమిషనర్ను నియమించింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, ఎండీగా రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథిని నియమిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధానిపై లక్ష్మీ పార్థసారధికి పూర్తి అవగాహన
2014- 2019 మధ్య కాలంలో లక్ష్మీ పార్థసారథి ఏడీసీ సీఎండీగా వ్యవహరించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ సహా అమరావతి అభివృద్ధిపై ఆమెకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. దీంతో ఆమె సేవలను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలోనిర్మాణాలను పరిశీలించి అధికారులకు సూచనలు జారీచేశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ ఇప్పటికే రాజధాని పరిధిలో జరుగుతున్న, జరగాల్సిన పనులను పర్యవేక్షిస్తున్నారు.

మొక్కులు చెల్లించుకుంటున్న రైతులు
అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 2014-19 మధ్య కొన్ని నిర్మాణాలు జరిగాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. ఈ ఐదు సంవత్సరాలు వాటిని అలాగే వదిలేయడంతో పిచ్చిచెట్లు మొలవడంతోపాటు పునాదుల కోసం తవ్విన ప్రాంతాలన్నీ నీటితో నిండి మంచినీటి చెరువులను తలపిస్తున్నాయి. ముళ్లకంపలను తొలగించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ ద్వారా రాకపోకలు జరుగుతున్నాయి. అలాగే ఉండవల్లి, పెనుమాక మీదగా కూడా అమరావతికి మరో మార్గంలో రాకపోకలు యథావిధిగా జరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాలినడకన తిరుమలకు పాదయాత్రగా వస్తామని మొక్కుకున్న రైతులు బృందాలవారీగా పాదయాత్రను పూర్తిచేసి తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications