ఏపీలో 'పుష్ప2' ఆడుతున్న థియేటర్లు సీజ్
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 సినిమా మొదటి నాలుగు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు వసూలు చేసింది. భవిష్యత్తులో ఈ సినిమా మరెన్ని కలెక్షన్లు కొల్లగొడుతోందో అనే ఆత్రుతలో ట్రేడ్ పండితులు ఉన్నారు. నిజమైన పాన్ ఇండియా సినిమా అంటే ఇదే అని, ఉత్తరాదిలో హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను తమ సొంత సినిమాగా భావిస్తున్నారని, ఒక డబ్బింగ్ సినిమాకు ఒరిజినల్ సినిమాకన్నా ఎక్కువగా కలెక్షన్లు రావడం అంటే సాధారణ విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు తగ్గిస్తుండటంతో కలెక్షన్లు బాగా పెరుగుతాయని నిర్మాతలు చెబుతున్నారు.
రెండు థియేటర్లు సీజ్
ఏపీలో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. అయితే శని, ఆదివారాల్లో కుటుంబ ప్రేక్షకులెవరూ వెళ్లకపోవడంతో థియేటర్లన్నీ ఖాళీగా కనిపించాయి. అందుకు కారణం టికెట్ ధరలే. తాజాగా కుప్పం నియోజకవర్గంలో పుష్ప2 లక్ష్మీ, మహాలక్ష్మీ థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. అయితే రెవెన్యూ అధికారులు అకస్మాత్తుగా ఈ థియేటర్లకు తాళాలు వేయడంతో అందరూ ఖంగుతిన్నారు. ఈ రెండు థియేటర్లకు సంబంధించిన లైసెన్స్ ను రెన్యువల్ చేయించుకోలేదని, అలాగే ఎన్వోసీ సర్టిఫికెట్ కూడా పొందలేదని అధికారులు వెల్లడించారు. ఈ రెండు కారణాలవల్లే థియేటర్లకు తాళాలు వేసినట్లు చెప్పారు. ముందుగా థియేటర్ల యాజమాన్యానికి నోటీసులు జారీచేయగా, వారినుంచి స్పందన రాకపోవడంతో తాళాలు వేశారు.

అధికారులపై మండిపడుతున్న బన్నీ అభిమానులు
ఈ రెండు థియేటర్లలో పుష్ప2 ఆడుతుండటతో అభిమానులు అధికారులపై మండిపడుతున్నారు. అభిమానులకు సినిమాను దూరం చేస్తున్నారని బన్నీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తనిఖీలు చేస్తుంటామని, అలా తనిఖీలు చేసే సమయంలో అనుమతి లేదని తేలడంతోనే వీటిని సీజ్ చేశామని, థియేటర్లు నడిపించాలంటే లైసెన్స్ లను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకుంటుండాలని, కానీ యాజమాన్యం ఆ పని చేయలేదని, అలాగే అన్నిరకాల సౌకర్యాలున్నట్లు ఎన్వోసీ పొందాలని, ఆ పనికూడా చేయలేదని చెప్పారు. సినిమా బాగా ఆడుతున్న సమయంలో కుప్పంలో మరో థియేటర్ లో ఈ సినిమా ఆడటంలేదని, సినిమా చూడాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని, వేరే థియేటర్లోనైనా ఈ సినిమా వేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లను బన్నీ అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications