బాబు తెలంగాణ డ్రామా

తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చంద్రబాబు మహబూబ్ నగర్ దాడి ఘటన సందర్భంగా మరోసారి చెప్పారు. అయితే, చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు కోసం తెలంగాణకు మద్దతుగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన తెలుగుదేశం లేఖ ఉత్త బూటకమని, డ్రామా అని తేలిపోయింది. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా ఉండి ఉంటే, డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనను చంద్రబాబు సమర్థించి ఉండేవారు. కనీసం మౌనంగానైనా ఉండలేదు. సీమాంధ్ర తెలుగుదేశం నాయకులనే కాకుండా కాంగ్రెసు నాయకులను కూడా చిదంబర ప్రకటనకు వ్యతిరేకంగా ఉసిగొల్పింది చంద్రబాబు నాయుడేనని విషయం కూడా ప్రజల్లోకి విస్తృతంగా పోయింది. సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామా లేఖలు చంద్రబాబు వద్దే తయారయ్యాయని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇది చంద్రబాబుకు తీవ్రమైన విఘాతం కలిగించే విషయం. కెసిఆర్ చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలను పకడ్బందీగా ఖండించే స్థితిలో తెలుగుదేశం తెలంగాణ నాయకులు లేరు. కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్న తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు.
ఈ స్థితిలో చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లో పర్యటించాలనే కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు. అదే సమయంలో దాడులు చేయిస్తుంది, తమకు ఆటంకాలు కలిగిస్తున్నది కేవలం తెరాస కార్యకర్తలేనని చెప్పడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలు వ్యతిరేకించడం లేదని, తెరాస ప్రణాళిక ప్రకారం తమకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయిస్తోందని ఆయన నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆయన తెలంగాణ వ్యతిరేతకు అద్దం పడుతుంది. తెలంగాణ విషయంలో చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన లేకపోవడాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే, తెలంగాణలో చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయం ఆయనకు తెలియంది కాదు. కానీ ఏదో రకంగా తెలంగాణను దెబ్బ కొట్టడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications