డిసెంబర్‌ నెల చీకటి రోజుల గురించి...

Telangana
డిసెంబర్ నెల బ్లాక్ డేలకి పేరొందినది గా చెప్పుకోవాలి. అందులో అరవ తారీకు మరిచి పోలేని దుర్దినం. ఇప్పటి బ్లాక్ డే 1992 బాబ్రి మస్జిద్ కూల్చివేతకి నిరసనగా ముస్లిం లు, హక్కుల సంఘాల వాళ్ళు, కమ్మునిస్ట్లు, సోసియలిస్టులు, అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు అందరు నిరసన దినంగా పాటించే రోజు. ఈ దేశ రాజ్యాంగంలో సర్వమతాలకు సమాన హక్కులున్నాయని రాసుకొని, రాం, రహీమ్ అందరు ఒకటే అని చరిత్ర పుస్తకాలలో, పాటలలో, మాటలలో చెప్పుకొని 'భిన్నత్వంలో ఏకత్వం' అని గొప్పగా చెప్పుకునే దేశం, ముస్లిం మతాన్ని తీవ్రంగా, పాశవికంగా అవమానించిన రోజు. హిందుత్వా ముసుగులో, దేశాన్ని మత కలహాలకు నిలయంగా, హిందూ ముస్లిం ల మధ్య చిచ్చుపెట్టిన రోజు. ఇది నిజంగా బ్లాక్ డే నే, నిరసన దినమే. హక్కులనేత ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా సెక్యూర్ చేయడానికి ప్రయత్నించినా మహా నేత వర్ధంతి రోజు జరిగిన హింస. రాజ్యాంగానికి తూట్లు పొడిచిన హిందూ సేనలు. మైనారిటీలమీద జులుం చూపించడమంటే ఈ దేశ చరిత్రని, సంస్కృతిని, మానవతా విలువలని కాల రాయడమే.

మరొక చీకటి దినం దేశానికి ఒక దశా దిశని నిర్దేశించిన మహా మనిషి నిష్క్రమణ, మహా పరినిర్వాన దినం గా లక్షలాది మంది ప్రజలు తమ నాయకునికి నివాళులు అర్పించే దినం. ఈ దేశంలో కులం ఒక భయంకరమైన జబ్బు, దీనిని నిర్మూలిస్తే గాని దేశాభి వృద్ధి సాధ్యం కాదు అని సోధించి, పరిశోధించి, సాధించిన మేధావి. అత్యంత ఉన్నత చదువులు చదివిన వాళ్ళలో ఒకడు, క్రింది కులాల లో బహుశ మొదటి, చివరి వాడు కూడా. చదువులన్ని జ్ఞానం కొరకే అని, జ్ఞానం అంత అజ్ఞానులకు, అమాయకులకు, అణచివేయబడిన వాళ్లకు ఆసరాగా ఉండాలని, వాళ్ళలో చైతన్యం నింపాలని, ప్రశ్నించడం నేర్పించాలని, అందరు సమానమే అన్న భావన అందరిలో నిపాలని తపన పడి, ఆచరణలో చూపించిన వ్యక్తీ. కొలంబియా యునివర్సిటి లో ఆర్థిక శాస్త్రం , లండన్ లో డాక్టరేట్, తరువాత బారిస్టర్ చదువు తిరిగి దేశానికి వచ్చి ప్రజా సేవలో నిమగ్నం. రాజ్యాంగ నిర్మాతగా, అంబేద్కర్ ని కేవలం క్రింది కులాలకి పరిమితం చేసి అందులో అంటరాని వాళ్లకి మాత్రమె చెందిన వ్యక్తిగా చూపించిన ఘనత ఇక్కడి చరిత్రకారులకి మాత్రమె దక్కుతుంది. ఈ దేశ స్వాతంత్రం సంగ్రామంలో, హక్కుల ఉద్యమంలో, మానవతా విలువలలో, మతాలలో, మైనారిటీలలో మమేకమై ఎన్నో విధాలుగా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించిన వ్యక్తీ. కేవలం లాయరుగా, లా మినిస్టర్ గా, రాజ్యంగా నిర్మాత గా , రాజకీయ వేత్తగా మాత్రమె కాకుండా అనేక రకాలుగా జీవితం చివరి క్షణం వరకు బడుగు, బలహీన కులాల హక్కులకోరకు, మానవత్వం రంగరించి, నిలబడి పోరాడిన వ్యక్తీ. ఈ రోజు ఆ మహానుభావుని 55 వ వర్దంతి. ఆయనే కనుక మరిన్ని రోజులు ఉండి వుంటే, కనీసం మరిన్ని మంచి మార్గాలు చూపించే వాడేమో.

మరొక చీకటి కోణం, దినం, డిసెంబర్ 9 కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన. చిన్న రాష్ట్రాలు పరిపాలనకు సులువు, కేవలం భాషా ప్రాతిపదికన మాత్రమె విభజిస్తే సరిపోదు, జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక పరమైన అంశాలని ఆధారంగా చేసుకొని విభజించాలని ఆనాడే చెప్పిన స్పుర ద్రుపి డాక్టర్ అంబేద్కర్ . ఇపుడు బాబా సాహెబ్ మన ముందు లేరు కాని ఆర్టికల్ 3 ప్రకారం అత్యంత సులువైన మార్గం ద్వారా చిన్న రాష్ట్రాలకు మార్గం చూపెట్టినాడు, మన రాజకీయ నాయకులకి చిత్త శుద్ధి లోపించి ఎవరు కూడ ఆ పద్ధతి ద్వారా తెలంగాణని సాధిద్దాం అని అనుకోవట్లేదు. కేవలం దందా నడపడానికి, తమ జీవితాలు బాగు చేసుకొని, సకుటుంబ సమేతంగా రాజకీయ లబ్ది పొందుతూ ముందుకు పోతున్నారు. ఎవరైతే శత్రువులని మనం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామో వారితోనే జత కడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలని ఎప్పటికపుడు తమ స్వార్థం కోసం ఉపయోగించు కుంటూ నడుస్తున్న నాయకత్వాలు. ప్రజలను తేనెపూసిన కత్తితో తూట్లు పొడుస్తూ, ఉద్యమాన్ని నీరు కారుస్తూ రోజులు వెళ్ళ దీస్తున్న రాజకీయాలు. అయినా కూడా నాయకులని మెడలు వంచి, కేంద్రానికి వణుకు పుట్టించి ఉవ్వెత్తున లేచిన ఉద్యమం తనకంటూ డిసెంబర్ 9 న చిదంబరం నోటి ద్వారా కేంద్రం తరపున ఒక ప్రకటనని సాధించుకున్నది. అది ప్రకటన లాగానే మిగిలిపోయింది. మరొక తీరని ద్రోహంగా చరిత్రలో నిలబడ బోతోంది ఏమో. వచ్చిన ప్రకటనని నిలబెట్టుకోలేక పోయినం, మీడియా సాక్షిగా వెలువడిన ప్రకటనలకి ఈ భారత ప్రాజాస్వామ్యంలో చోటు లేదు. ఎట్లైనా సాధించాలనే పట్టుదలతో నాయకుల మాటలకి పొంగి పోయి, ఆవేశ పడి, ఆందోళన చెంది ఎన్నో పానాలు పోగొట్టుకున్నాము. ఆ ప్రాణాలకి విలువ లేదు, కేసుల మీద కేసులు పెట్టి, నిజాయితీ పరులని జైల్లో పెట్టి, ప్రలోభ పెట్టి తెలంగాణని మల్లా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినమా?

ఈ సారికి రెండు వార్షికోత్సవాలు పూర్తి చేసుకున్నాం, నిన్నటి అవిశ్వాసం సినిమా చూసిన తరువాత ఈ రాజకీయాల మీద ఏవైనా నమ్మకాలుంటే అవన్నీ పూర్తిగా మట్టి గొట్టుకొని పోయినయి. ఆటు జగన్ చాల గొప్పగా మా ఎమ్మెల్యేలు మాట దాటలేదు అని చెప్పుకుంటే, ఇటు చిరంజీవి అనే సినిమా హీరో నా మాటా జవ దాటారు మావారు అని చెప్పుకుంటున్నాడు. వాళ్ల వాళ్ల అజెండాలు ఏవైనా కానీయండి, మాట మీద నిలబడడం మొదటినుంచి మనం చూస్తున్నాం. మరి ఈ గడ్డ మీద పుట్టి, ఈ జనాల వోట్లతోని బతికి బట్టకట్టి, తెలంగాణ మాతోనే సాధ్యం అని కోతలు కోసిన వారి సమాధానం? మా నాలుగు కోట్ల ప్రజల కోరిక కోసం(మా కోసం కాకున్నా) మేమందరం తెలంగాణ వైపే అన్నారా? అందరికి తెలిసిన నిజం ఒక్కటె,
నువ్వు నేను భాయి భాయి,
పార్టీ ఏదైనా కానివ్వోయి
మల్లా ఎలక్షన్లలో చూసుకున్దామోయి
తెలంగాణని మరికొన్ని రోజులు నాననివ్వోయి
మరిన్ని పదవులు కొట్టేయోచ్చోయి
అప్పటిదాకా ఎంజాయ్ చేయి
జైతెలంగాణ అడ్డంపెట్టుకొని..

ఈ చీకటి రోజులని దాటుకొని వచ్చే వెలుగు కిరణాలకై మన ఎదురు చూపు, లేదంటే మనమే జగన్నాథ రధ చక్రాలై దోపిడీ దారుల గుండెల్లో పరుగు పెట్టాలె..అదే తెలంగాణ విముక్తి మార్గం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+