నరమేథ యజ్ఞం
భారతదేశంలో ఇంకా నరమేథం యజ్ఞం ఉందంటే నమ్మశక్యమేనా? ఉందనడానికి ధీటైన సాక్ష్యాలున్నాయి. ఇదంతా పవిత్ర దైవ కార్యం పేరు మీద, హిందూ మత సంప్రదాయం పేరు మీద నిరాటంకంగా, ప్రభుత్వం అనుమతితో జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఆచరణలో ఉంది. బీరా అనే దళిత కులం ఈ దురాచారానికి బలి అవుతోంది.
నిరుడు డిసెంబర్ 25వ తేదీన సిమ్లా జిల్లాలోని రోర్తులో జరిగింది. ఈ గ్రామం స్వయానా ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ నియోజకవర్గంలో ఉండడం మరో విశేషం. దీనిపై మీడియా ప్రశంసల వర్షాలు కురిపించింది. అత్యంత గొప్ప మత సంప్రదాయంగా, ఉన్నత హిందూ సంస్కృతికి ప్రతీకగా మీడియా దీన్ని అభివర్ణించింది.
1971 వరకు హిమాచల్ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రంలో ఉండేది. పంజాబ్ ప్రభుత్వం ఈ ఆచారాన్ని 1962లో నిషేధించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేయించడానికి ప్రభుత్వంపై బ్రాహ్మణవర్గం తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. వీరభద్ర సింగ్ రాజవంశానికి చెందినవారు. ఆయన రాజా పద్మ కుమారుడు. సహజంగానే తన వంశగుణాన్ని ప్రదర్శించి నిషేధం ఎత్తివేశారు.
బ్రాహ్మణులు ఒక బీరా కులస్థుడ్ని ఆలయానికి ఆహ్వానించి పెద్ద గడ్డి తాడును పేనాల్సిందిగా ఆదేశిస్తారు. తాడు పేనడానికి దాదాపు మూడు నాలుగు నెలల సమయం పడుతుంది. ఆ తాడు ఒక చివరను లోయ కింది భాగంలో కడుతారు. మరో చివరను ఆ లోయ శిఖరాన కడుతారు. నరమేథానికి ముందు పూజారులు ఊరిలో ఊరేగింపు జరుపుతారు. ఈ సందర్భంగా జంతువులను యధేచ్ఛగా బలి ఇస్తారు. మద్యం సేవిస్తారు; మాంసం తింటారు.
బీరాను ఆలయంలోకి పూజారులు పిలిచి స్నానం చేయిస్తారు. భగవంతుడు పరుశరాముడిని ధ్యానించుకోవాల్సిందిగా ఆదేశిస్తారు. అతని తలపై పంచరత్న కిరీటాన్ని పెడతారు. శవానికి కప్పే వస్త్రాన్ని అతనికి ఇచ్చి శిఖరం మీదికి తీసికెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు. ఆ తర్వాత అతన్ని తాడుపై కూర్చోబెట్టి గట్టిగా తోస్తారు. ఈ తాడు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. తన భర్త ప్రాణాలను రక్షించాల్సిందిగా ధ్యానించాలని అతడి భార్యను ఆదేశిస్తారు. తాడుపై బీరా జారే దూరాన్ని తగ్గించాలని, బీరా ప్రాణాలను కాపాడడానికి ఒక వలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం బ్రాహ్మణులను ఆదేశించింది. వేలాది మంది చూస్తుండగా భార్య కళ్లెదుట బీరా లోయలో పడిపోతాడు. బీరా పంచరత్న కిరీటంపై కత్తులతో 19 సార్లు కొడుతారు. అప్పటికీ బతికి వుంటే భార్యతో పాటు అతడ్ని ఆలయంలోకి తెచ్చి అతనికి బ్రాహ్మణత్వాన్ని ప్రసాదిస్తారు. అయితే ఈ నరమేథ యజ్ఞం చరిత్రలో అలా బతికి బట్ట కట్టిన బీరా ఇప్పటి వరకు లేడు. ఇంత దారుణమైన ఆచారంలో ఎవరైనా బతికి ఉంటారని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది.
ఈ క్రూరమైన ఆచారంపై మానవ హక్కుల కమీషన్కు ఫిర్యాదు చేస్తున్నారు. దళిత మేధావులు దీనికి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఆచారాన్ని ఖండించి ఆపించేందుకు ఉద్యమం చేపట్టే దిశలో సాగుతున్నారు.