Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దక్షిణాదిలో కరువు: తెలంగాణ బియ్యానికి ఫుల్ డిమాండ్

వర్షాభావం వల్ల నెలకొన్న కరవు పరిస్థితులతో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ బియ్యానికి డిమాండ్‌ భారీగా పెరగనున్నది.

హైదరాబాద్‌: వర్షాభావం వల్ల నెలకొన్న కరవు పరిస్థితులతో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ బియ్యానికి డిమాండ్‌ భారీగా పెరగనున్నది. రబీ సీజన్‌లో దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆయకట్టు కింద పంట సాగు చేయకపోవడంతో దిగుబడి కాస్త తగ్గనున్నది.

దీంతో తెలంగాణ బియ్యం దక్షిణాది భారత్‌లోని ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతయ్యే వీలున్నదని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దుర్భిక్షం నెలకొనగా, కర్ణాటకలోని చాలా ప్రాంతాలు కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే తమిళనాడు రైతులు కరువుతో సతమతమవుతున్నామని, తమకు సహాయ నిధి ప్రకటించాలని దాదాపుగా నెల రోజులుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు.

Drought in South: Telangana rice gets demand

తమిళనాడులో 11 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం లక్ష్యంగా పెట్టుకొంటే, లక్ష టన్నులకు మించి సేకరించలేకపోయింది. కేరళ ప్రభుత్వం కరవును అధికారికంగానే ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాలకు నెలకు 3 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సరఫరా చేస్తోంది. కరవు కారణంగా ఈ ఏడాది ఇంకా ఎక్కువగానే సరఫరా చేయాల్సి ఉంటుందని ఎఫ్‌సీఐ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో కావేరి కింద వరి నామమాత్రంగానే సాగైంది. 2016 - 17లోనే తుంగభద్ర జలశయానికి అతి తక్కువ నీటి లభ్యత ఉన్నదని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.

ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో కరువు

ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి డెల్టా కిందే రబీలో పూర్తిస్థాయి పంట వచ్చింది. తెలంగాణలో మాత్రం రబీలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగవడమే కాకుండా, దిగుబడి కూడా మెరుగ్గా ఉంది. నిజానికి రబీలో 37 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేసింది. బోర్లు ఎండిపోవడం, వాతావారణ ప్రభావం కారణంగా లక్షన్నర ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ సర్కారుకు నివేదించినట్లు సమాచారం. అయినా సాగు విస్తీర్ణం పెరిగి, ఉత్పాదకత మెరుగ్గా ఉన్నందున దిగుబడి ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

పట్టుపట్టిన పౌరసరఫరాలశాఖ

రెండేళ్ల క్రితం వరకు ఎఫ్‌సిఐ పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేసేది. కానీ, 2014-15లో 25% దిగుబడిని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయగా, 2015-16 నుంచి ధాన్యం సేకరణను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే విధానం అమలులోకి వచ్చింది. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు ఇస్తే.. వారు తిరిగి బియ్యాన్ని ఇవ్వాలి. వీటిని ఎఫ్‌సీఐ తీసుకుంటోంది. గతంలో మిల్లర్లు బియ్యాన్ని పూర్తిగా ఇవ్వకపోవడం, జాప్యం చేయడం జరిగేది. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ కఠినంగా వ్యవహరించడంతో, ఖరీఫ్‌లో బియ్యం పూర్తిగా మిల్లర్ల నుంచి తిరిగొచ్చింది. ఇలా 11 లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 22.88 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సమకూరింది.

జాప్యం లేకుండా ధాన్యం సేకరణ

ప్రస్తుత రబీలో ధాన్యం సేకరణకు, మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో బియ్యాన్ని తిరిగి తీసుకునేందుకు పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేసింది. బియ్యం తమకు అందిన వెంటనే, అందుకు సంబంధించిన పైకాన్ని జాప్యం చేయకుండా చెల్లించేందుకు ఎఫ్‌సీఐ కూడా అంగీకరించింది. రబీలో ధాన్యం దిగుబడి తక్కువగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌ మిల్లర్లూ తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకుఆసక్తి చూపే అవకాశం ఉంది.

నిబంధనల పేరుతో ప్రభుత్వ సంస్థలు ధాన్యాన్ని కొనడంలో జాప్యంచేస్తే... మిల్లర్లు దీనిని అవకాశంగా తీసుకొనే ప్రమాదముంది. ఇప్పటికే ధాన్యం మార్కెట్‌కు రావడం ప్రారంభమైంది. కాగా, కొన్నిచోట్ల వ్యాపారులు తక్కువ ధరకు కొనేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో పాటు తెలంగాణ నుంచీ తమిళనాడు, కేరళ రాష్ట్రాలు బియ్యాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకొనే అవకాశముందని ఎఫ్‌సీఐ వర్గాలు తెలిపాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+