మట్కా ఛాయ్ : హైదరాబాద్ నయా ఎట్రాక్షన్
హైదరాబాద్ : హైదరాబాద్ ను సందర్శించే యాత్రికులెవరైనా.. ఖచ్చితంగా ఇరానీ ఛాయ్, ఇక్కడి బిర్యానీ రుచి చూడందే నగరాన్ని వీడరు. హైదరాబాద్ బ్రాండ్ కు ఇవి కూడా ఓ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. అలాంటి హైదరాబాద్ లో మట్కా ఛాయ్ ఆచూకీ మాత్రం ఎక్కడా కనపడదు. నగరానికి, నగరవాసులకు దీనితో పెద్దగా పరిచయం లేదు.
కానీ బెంగుళూరు, కోల్ కతా లాంటి నగరాల్లో మట్కా ఛాయ్ చాలా ఫేమస్. అక్కడి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఈ మట్కా ఛాయ్ ను ఆస్వాదిస్తూ తమ ప్రయాణాల్ని సాగిస్తుంటారు. అయితే ఇన్ని రోజులు హైదరాబాద్ నగరానికి దూరంగా ఉండిపోయిన ఈ మట్కా ఛాయ్ ను నగరవాసులకు దగ్గర చేసే ప్రయత్నం జరుగుతోంది.
ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా నగరంలోని బాగ్ లింగంపల్లి పరిధిలో ఉన్న సంజయ్ నగర్ లో తొలిసారిగా మట్కా ఛాయ్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు తోట విష్ణు. ఇంతకీ మట్కా ఛాయ్ కి మామూలు ఛాయ్ కి తేడా ఏంటంటే..! మట్కా ఛాయ్ ను మట్టి పాత్రలో సేవించడం దీని ప్రత్యేకత. పర్యావరణ పరిరక్షణకు, శారీరక ఆరోగ్యానికి మట్టి పాత్రలు ఎంతగానో దోహదపడుతాయి కాబట్టి, మట్టి పాత్రలో ఛాయ్ ని విక్రయిస్తుంటారు.
ఇదే విషయాన్ని నగరంలో మట్కా ఛాయ్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు తోట విష్ణు తెలిపారు. ఆయన తల్లిదండ్రులు సావిత్రి, ఈశ్వరయ్య చేతుల మీదుగా సంజయ్ నగర్ లో మట్కా ఛాయ్ ను ప్రారంభించారు. త్వరలో నగరంలోని మరిన్ని సెంటర్లలో మట్కా ఛాయ్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని, మొబైల్ వెహికిల్ ద్వారాను మట్కా ఛాయ్ ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు. ఇక మట్టి పాత్రల్లో ఛాయ్ ని సేవించడానికి నగరవాసులు రెడీ అయిపోవాల్సిందే.