అమెరికా బాట: తెలుగువారే ఎక్కువ, ఎందుకు?
హైదరాబాద్: తెలుగు విద్యార్థులు ఎక్కువగా అమెరికా బాట పడుతున్నారు. అలా ఎందుకు జరుగుతుందనేది ఆసక్తికరమైన విషయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. ఆ కోర్సుల్లో చేరడం కూడా తేలికే అయింది. విద్యార్థులు సరిపోనంతగా ఆ కాలేజీలు పెరిగాయి.
ఆ కాలేజీల్లో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు వెంటనే ఉద్యోగులు వస్తున్నాయా అంటే రావడం లేదు. దాంతో వారు అమెరికా బాటపడుతున్నారు. అమెరికాలో దాదాపు 1.80 లక్షల మంది భారత విద్యార్థులుండగా వారిలో 20-25 శాతం మంది తెలుగువారే అనే విషయం హైదరాబాదు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
జీఆర్ఈలో స్కోరు ఎంత సాధిస్తారనేదాన్ని లెక్కలోకి తీసుకోకుండా దానికి హాజరైతే చాలుననే భావన బలంగా ఉంది. దీంతో ఈ ఆన్లైన్ పరీక్షను హైదరాబాద్లో వేలాది మంది రాస్తున్నారు. చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో కన్నా ఇక్కడే ఎక్కువ. ఈ పరీక్షలు రాసి విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా వంటి విదేశాల తోవ పడుతున్నారు.

ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని పరీక్షించే టోఫెల్, ఐఈఎల్టీఎస్ పరీక్షల తేదీ కావాలంటే రెండు నెలలు వేచి ఉండాల్సి వస్తోందని అంటున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో సమయం ఎక్కువగా పడుతోందట. ఆంగ్లం మాతృభాషగా కలిగిన అమెరికా లాంటి దేశాల్లో ఉన్నత విద్య చదవాలంటే ఆ భాషలో కనీస సామర్థ్యాన్ని పరీక్షించే టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్(టోఫెల్), ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్(ఐఈఎల్టీఎస్)లో ఏదో ఒక దాంట్లో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.
టోఫెల్లో 120కి 80, ఐఈఎల్టీఎస్లో 9కి 6 స్కోరు కనీసం సాధించాలి. కొన్ని ప్రముఖ, నాణ్యతను పాటిస్తున్న విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలలు గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్(జీఆర్ఈ), గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు(జీమ్యాట్)లను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలకు అనుమతి పత్రాన్ని(ఐ 20) జారీ చేస్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) అనే సంస్థ టోఫెల్, జీఆర్ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ఐఈఎల్టీఎస్ను బ్రిటిష్ కౌన్సిల్, ఆస్ట్రేలియా సంస్థ ఐడీపీలు వేర్వేరుగా నిర్వహిస్తాయి. బ్రిటిష్ కౌన్సిల్ నిర్వహించే పరీక్షకు స్లాట్ కావాలంటే ఎక్కువ సమయం పడుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్, ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి తదితర నగరాల్లో పరీక్ష కేంద్రాలున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసమే కాకుండా శిక్షణ కోసం కూడా లెక్కకు మిక్కిలి హైదరాబాద్ వస్తుంటారు. ఈ ప్రముఖ దినపత్రిక ఇచ్చిన లెక్కల ప్రకారం - హైదరాబాద్లో టోఫెల్కు సుమారు 30, ఐఈఎల్టీఎస్కు రెండు, జీఆర్ఈకి మూడు కేంద్రాలున్నాయి. టోఫెల్, ఐఈఎల్టీఎస్కు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. హైదరాబాద్లోనే సుమారు 20 వేల మంది ఈ పరీక్ష రాస్తున్నట్లు కోచింగ్ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు.
ఆన్లైన్ పరీక్ష అయిన టోఫెల్ కంటే రాత పరీక్ష అయిన ఐఈఎల్టీఎస్ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అమెరికాలోని అధిక వర్సిటీలు లేదా కళాశాలలకు జీఆర్ఈ, జీమ్యాట్ తప్పనిసరి కాదు. ఇటీవల సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్రన్లో చేరేందుకు వెళుతున్న వారిలో ఎక్కువ మంది ఐఈఎల్టీఎస్లో అతి తక్కువగా 5 స్కోర్ వచ్చిన వారే. బహుశా దానివల్లనే ఆ విద్యార్థులను వెనక్కి పంపించి ఉంటారనే అభిప్రాయం కూడా ఉంది.












Click it and Unblock the Notifications